Sania Mirza | దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. దుబాయ్ ఈవెంట్తో కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఓడింది. మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో సానియా మీర్జా-మాడిసన్ కీస్ (అమెరికా) ద్వయం 4-6, 0-6తో వెరోనికా-లుడామిలా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో ఒక దశలో 4-4తో చక్కటి ప్రదర్శన కనబర్చిన సానియా జోడీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. 2003లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన సానియా.. 43 డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. రెండు దశాబ్దాలపాటు కెరీర్ కొనసాగించిన సానియా.. 6 గ్రాండ్స్లామ్ టైటిల్స్ చేజిక్కించుకుంది. ఇందులో మూడు మహిళల డబుల్స్ కాగా.. మరో మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి.
ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రోఆసియా గేమ్స్ ఇలా అన్నింట్లోనూ మెడల్స్ చేజిక్కించుకున్న 36 ఏండ్ల సానియా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ రన్నరప్గా నిలిచింది. తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన మెల్బోర్న్లోనే గ్రాండ్స్లామ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టిన సానియా.. తాజా పరాజయంతో ప్రొఫెషనల్ టెన్నిస్కు దూరమైంది. ఇప్పటి వరకు కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ సాధించిన సానియా మీర్జా.. ఆటతో పాటు ఆటేతర విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలిచింది. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న సానియా.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెండ్లాడి అంతకుమించిన విమర్శలు ఎదుర్కొంది. అయినా.. దేనికి భయపడని ఆమె మనస్తత్వమే సానియాను ఈ స్థాయికి చేర్చింది. భారత మహిళల టెన్నిస్ ప్రస్థావన వస్తే చాలు.. అందులో సింహభాగం సానియా మీర్జా గురించే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటిని హుందాగా ఎదుర్కొన్న సానియా.. కొన్నిటికి రాకెట్తో, మరికొన్నిటికి నోటితో కూడా సమాధానాలిచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం బ్రాండ్ అంబాసిడర్గానూ కొనసాగిన సానియా.. దేశంలో అమ్మాయిల టెన్నిస్కు అనధికారిక అంబాసిడర్గా నిలిచింది.
రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్.. 6 గ్రాండ్స్లామ్ టైటిల్స్.. 43 కెరీర్ డబుల్స్ టైటిల్స్.. లెక్కకు మిక్కిలి అవార్డులు, రివార్డులు.. భారత మహిళల టెన్నిస్కు పర్యాయపదంలా నిలిచిన స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టింది. ఇప్పటికే గ్రాండ్స్లామ్స్కు టాటా చెప్పేసిన ఈ హైదరాబాదీ ప్రొఫెషనల్ కెరీర్ను పరాజయంతో ముగించింది. కెరీర్లో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకొని దేశంలో యువతులు రాకెట్ పట్టేందుకు ప్రేరణగా నిలిచిన సానియా కెరీర్ను ఓసారి పరికించి చూస్తే..
‘మన దేశంలో అమ్మాయిలు సరికొత్త చరిత్ర లిఖించాలంటే.. బరిలోకి దిగిన తర్వాత పోరాడటం కాదు.. అక్కడి వరకు రావడానికే ప్రపంచ యుద్ధం చేయాల్సి ఉంటుంది’.. ఇది కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు. నిజమే కదా.. తల్లిదండ్రులతో కలిసి నిజాం క్లబ్లో సరదాగా రాకెట్ చేతపట్టిన ఆరేండ్ల అమ్మాయి ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్గా ఎదిగేందుకు పడ్డ కష్టమేంటో సానియాకు మాత్రమే తెలుసు. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో ఇమ్రాన్ మీర్జా, నసీమ దంపతులకు 1986 నవంబర్ 15న జన్మించిన సానియా మీర్జా.. భారత టెన్నిస్కు వన్నెతెచ్చింది అనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. చుట్టుపక్కల వాళ్ల సూటి పోటి మాటలు, చుట్టాల దెప్పిపొడుపులు, మత పెద్దల ఫత్వాల మధ్య 2003లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన సానియా.. రెండు దశాబ్దాల్లో ఎన్నో ఘనతలు మూటగట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పతకం నెగ్గాక త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నప్పుడు కలిగే అనుభూతి ముందు ఇవన్నీ గడ్డపోచతో సమానమని తెగేసి చెప్పిన సానియా.. భారత టెన్నిస్ ముఖచిత్రాన్ని మార్చింది. ముఖ్యంగా మహిళల టెన్నిస్లో ‘మొట్ట మొదటి’ అనే పదానికి సానియా పర్యాయపదంగా నిలిచింది.
పదేండ్ల పాటు సింగిల్స్లోనూ మంచి విజయాలు సాధించిన సానియా.. అత్యుత్తమంగా ప్రపంచ 27వ ర్యాంక్కు చేరింది. మణికట్టు గాయంతో సింగిల్స్కు దూరమయ్యేంత వరకు (2013) భారత్ తరఫున సింగిల్స్లో సానియానే నంబర్వన్గా కొనసాగిందంటే ఆమె ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశం తరఫున డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్, అత్యధిక ప్రైజ్మనీ గెలిచిన క్రీడాకారిణి, డబుల్స్లో హయ్యెస్ట్ ర్యాంక్, అత్యధిక కెరీర్ టైటిళ్లు, అత్యధిక గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్, అత్యధిక మేజర్ టైటిల్స్ ఇలా అన్నీ సానియా పేరిటే ఉండటం గమనార్హం. గ్రాండ్స్లామ్ డబుల్స్లో 6 టైటిల్స్ నెగ్గిన సానియా మీర్జా.. 91 వారాల పాటు ఏకధాటిగా డబుల్స్లో ప్రపంచనంబర్వన్గా కొనసాగింది. సింగిల్స్లోనూ అద్భుతాలు సృష్టించిన సానియా.. తన కెరీర్లో ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు మార్టీనా హింగిస్, డినారా సఫీనా, విక్టోరియా అజరెంక వంటి వాళ్లపై విజయాలు నమోదు చేసుకుంది. మణికట్టు గాయంతో సింగిల్స్కు స్వస్థి పలికిన సానియా.. ఆ తర్వాత డబుల్స్లో మరింత రెచ్చిపోయింది. ఇటు కెరీర్ను అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ సాగిన సానియా.. తల్లిగా మారిన తర్వాత కూడా తనలో సత్తా తగ్గలేదని ప్రపంచానికి చాటింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్కు చేరడమే దీనికి నిదర్శనం.
దేశం తరఫున డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిలిచిన సానియా మీర్జా.. మొత్తంగా 43 మేజర్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. ఒకానొక దశలో మార్టీనా హింగిస్తో కలిసి మహిళల డబుల్స్లో వరుసగా 44 మ్యాచ్ల్లో అపజయం ఎరుగకుండా దూసుకెళ్లిన సానియా మీర్జా కెరీర్లో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకుంది. 2005లో డబ్ల్యూటీఏ న్యూ కమర్ (ఎమర్జింగ్ ప్లేయర్) అవార్డు అందుకున్న సానియా.. 2015లో డబుల్స్ టీమ్ ఆఫ్ ఇయర్కు ఎంపికైంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆఫ్రోఆసియా క్రీడల్లో కలిపి సానియా మొత్తం 14 మెడల్స్ మూటగట్టుకుంది. అందులో ఆరు స్వర్ణాలు ఉండటం విశేషం. భారత్ నుంచి ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ అందుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచిన సానియా మీర్జా.. కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్స్ పతకాన్ని 2016 (రియో)లో తృటిలో చేజార్చుకుంది. గత నెలలోనే ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన సానియా.. మంగళవారం చివరి మ్యాచ్ ఆడేసింది. తనకు తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ దక్కిన ఆస్ట్రేలియా ఓపెన్లోనే గ్రాండ్స్లామ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టిన సానియా.. దుబయ్ టోర్నీతో ప్రొఫెషనల్ కెరీర్ టాటా చెప్పింది. ఇకపై వ్యాఖ్యాతగా, కోచ్గా, మెంటార్గా కొత్త అవతారంలో దర్శనమిస్తానని మాటిచ్చిన సానియా.. దేశంలో ఎందరో యువతులు టెన్నిస్ రాకెట్ పట్టేందుకు స్ఫూర్తిగా నిలిచింది.