T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీ అంటే చాలు టీమిండియా(Team India) కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. ఈసారి టీ20 వరల్డ్ కప్లోనూ భారత క్రికెటర్లు నయా జెర్సీలో తళుక్కుమననున్నారు. సోమవారం ఇండియా టీమ్ స్పాన్సర్ అడిడాస్ ఇండియా(Adidas India) కంపెనీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్లు చూస్తుండగా హెలిక్యాప్టర్ ఎంట్రీతో జెర్సీని విడుదల చేసింది.
ప్రపంచ కప్ కోసం రూపొందించిన జెర్సీ ప్రత్యేకంగా ఉంది. భుజాలపై కాషాయ రంగు, తెలుపు రంగు అడ్డ గీతలు.. మిగతా భాగమంతా నీలి రంగుతో చూడముచ్చటగా ఉంది. దాంతో, అభిమానులు ‘జెర్సీ సూపర్’ అంటూ కామెంట్లు పెడతున్నారు.
అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్లు మే 2వ తేదీన వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో అదరగొడుతున్న శివం దూబే బెర్తు దక్కించుకోగా.. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. ఇక మూడేండ్లుగా జట్టుకు దూరమైన యజ్వేంద్ర చాహల్ మెగా టోర్నీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
భారత స్క్వాడ్ : ఇదే రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు : శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
జూన్ 1వ తేదీన పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. టీమిండియా తొలి పోరులో జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. రెండేండ్ల క్రితం ఇంగ్లండ్ చేతిలో సెమీ ఫైనల్లో కంగుతిన్న భారత్.. ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ, చాహల్, సూర్యకుమార్ యాదవ్, జడేజాలకు బహుశా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్. దాంతో, ఎలాగైనా సరే 11 ఏండ్లుగా ఊరిస్తున్న అందని ద్రాక్షను పట్టేయాలని రోహిత్ సేన భావిస్తోంది.