డిచ్పల్లి, మార్చి 16 : అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామం ప్రస్తుతం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. చిన్న పంచాయతీ అయినా ప్రగతిలో దూసుకుపోతున్నది. ఇందుకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ముల్లంగి (ఐ) గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసింది. గ్రామస్తుల సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో ముందున్నది. పల్లె ప్రగతితో ముల్లంగి గ్రామ రూపురేఖలు మారాయి. గ్రామంలో ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మండలంలోనే ఎక్కడాలేని విధంగా వైకుంఠధామాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు వచ్చి వైకుంఠధామాన్ని పరిశీలించారు. వైకుంఠధామంలో సేదతీరేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి, మొక్కలు నాటడంతో ఎంతో సుందరంగా రూపుదిద్దుకున్నది. అలాగే గ్రామానికి చెందిన దుబాయ్ యూత్ సంఘ సభ్యులు వైకుంఠధామానికి ఫ్రీజర్ను అందించారు. కొందరు గ్రామ నాయకులు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయించారు. పల్లె ప్రకృతివనాన్ని సైతం సుందరంగా తీర్చిదిద్దారు.
ముల్లంగి గ్రామస్తుల కృషి తో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సైతం గ్రామాభివృద్ధికి సహా య సహకారాలు అందిస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మున్ముందు గ్రామాన్ని ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తా.
-పాశం లావణ్య మధుసూదన్, సర్పంచ్, ముల్లంగి(ఐ)