సర్ఫరాజ్ సత్తాచాటాడు.. జురెల్ జోరు కనబర్చాడు.. ఇప్పుడు అదే బాటలో ఇంగ్లండ్పైనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆకాశ్ అదరగొట్టాడు. బుమ్రా గైర్హాజరీలో కొత్త బంతి అందుకున్న ఆకాశ్.. టాప్-3ని ఔట్ చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ఆకాశ్ ధాటికి ఇంగ్లిష్ జట్టు ఒక దశలో 112/5 తో నిలిచి.. రెండొందలకు లోపే ఆలౌటయ్యేలా కనిపించింది!
అయితే.. ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు బ్యాట్ ఝళిపించాడు. సహచరులంతా వెనుదిరుగుతున్న సమయంలో ఒంటరి పోరాటం చేస్తూ.. ‘బజ్బాల్’ఆటతీరును పక్కన పెట్టి.. తనకు అలవాటైన టెస్టు శైలిలో గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి.. జట్టును గట్టెక్కించాడు!!
Ind Vs Eng Test | రాంచీ: సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లిష్ జట్టు.. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. గత మూడు టెస్టుల్లో మూడు సార్లు బుమ్రా బౌలింగ్లో ఔటైన రూట్.. జస్ప్రీత్ గైర్హాజరీని పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. జాక్ క్రాలీ (42; 6 ఫోర్లు, ఒక సిక్సర్), బెయిర్ స్టో (38), బెన్ ఫోక్స్ (47) పర్వాలేదనిపించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3), ఒలీ పోప్ (0), డకెట్ (11) విఫలమయ్యారు. మన బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్దీప్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. హైదరాబాదీ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. రూట్తో పాటు ఓలీ రాబిన్సన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. శనివారం మిగిలిన మూడు వికెట్లను భారత్ ఎంత త్వరగా పడగడుతుందనే దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.
‘టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఒక్కడు చేసినన్ని పరుగులు.. టీమ్ఇండియాలోని మొత్తం 11 మంది ప్లేయర్ల రన్స్ కంటే ఎక్కువే’.. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలివి. అయితే గతంలో భారత జట్టుపై టన్నుల కొద్ది పరుగులు చేసిన రూట్.. తొలి మూడు టెస్టుల్లో కుదురుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడగా.. బజ్బాల్ ఆటతీరు రూట్కు నప్పదని పలువురు సూచనలివ్వడంతో.. రాంచీలో తన సహజ శైలిలో ఆడిన రూట్ ఎట్టకేలకు సెంచరీతో కదంతొక్కాడు.‘ఫామ్ తాత్కాళికం.. క్లాస్ శాశ్వతం’అనే మాటలను నిజం చేస్తూ.. కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన చేస్తూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆకాశ్దీప్.. అరంగేట్రంలోనే సత్తాచాటాడు. ప్రధాన పేసర్ బుమ్రా గైర్హాజరీలో అతడి స్థానాన్ని భర్తీ చేసే పెద్ద బాధ్యతను భుజానెత్తుకున్న 27 ఏండ్ల ఆకాశ్దీప్.. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని చక్కగా వాడుకున్న ఆకాశ్దీప్.. తొలి మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ టాపార్డర్ను దెబ్బకొట్టాడు.