IND vs WI | పేలవ ఆటతీరుతో నానాటికీ తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్ జట్టు.. టీమ్ఇండియాతో రెండో టెస్టులో చక్కటి ఆటతీరు కనబరుస్తున్నది. స్టార్లతో నిండిన భారత బ్యాటింగ్ లైనప్ను అడ్డుకునేందుకు కరీబియన్ బౌలర్లు శక్తివంచన లేకుండా శ్రమించగా.. ఇప్పుడా బాధ్యత బ్యాటర్లు తీసుకున్నారు. అశ్విన్, జడేజా, సిరాజ్ బంతులను కాచుకుంటూ కెప్టెన్ బ్రాత్వైట్ హాఫ్సెంచరీతో రాణించగా.. మిగిలిన ప్లేయర్లు కూడా సారథి బాటలోనే ముందుకు సాగుతున్నారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: గత మ్యాచ్తో పోల్చుకుంటే.. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న వెస్టిండీస్ రెండో టెస్టులో పోరాడుతున్నది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టులో కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయిన విండీస్.. ఈసారి పట్టుదలతో ప్రయత్నిస్తున్నది. టాప్-3 బ్యాటర్లు బ్రాత్వైట్ (75), టగ్నరైన్ చందర్పాల్ (33), మెకంజీ (32) రాణించడంతో కరీబియన్లు కనీస పోటీ ఇవ్వగలిగారు. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడగా.. భారత బౌలర్లను విండీస్ ప్లేయర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓవర్నైట్ స్కోరు 86/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్.. టీ విరామానికి 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా, ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
క్రికెట్ చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో పర్వాలేదనిపిస్తున్నది. ఓపెనర్లు బ్రాత్వైట్, టగ్నరైన్ రాణించడంతో శుక్రవారం చివరి సెషన్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 86 పరుగులు చేసిన విండీస్.. మూడో రోజు అదే జోరు కొనసాగించింది. తొలి సెషన్లో బ్రాత్వైట్కు చక్కటి సహకారం అందించిన మెకంజీని ముఖేశ్ పెవిలియన్ పంపాడు.
తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్కు ఇదే మొదటి వికెట్ కాగా.. విండీస్ 117/2తో ఉన్న సమయంలో వరుణుడు కాసేపు మ్యాచ్ను అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. బ్యాటర్లు మరింత పట్టుదల కనబర్చారు. జడేజా, అశ్విన్ను జాగ్రత్తగా ఎదుర్కొన్న కరీబియన్లు.. పేసర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు.