ఇంగ్లండ్తో తొలి టెస్టులో భారత విజయానికి ఓలీ పోప్ అడ్డుగోడలా నిలిచాడు.సహచరులంతా తడబడ్డ ఉప్పల్ పిచ్పై.. అసమాన రీతిలో పోరాడిన పోప్ అజేయ శతకంతో ఇంగ్లిష్ జట్టును మంచి స్థితికి చేర్చాడు. మూడో రోజంతా ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన చేయగా.. భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆదివారం ఇంగ్లండ్ను ఎన్ని పరుగుల లోపు ఆలౌట్ చేస్తారనేది కీలకంగా మారింది!
Ind Vs Eng Test | హైదరాబాద్, ఆట ప్రతినిధి: బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చూపాడు. సహచరులు చేతులెత్తేసిన చోట ఒంటరి పోరాటం చేసిన పోప్.. ఇంగ్లండ్ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. మూడో రోజే ముగిసేలా కనిపించిన మ్యాచ్ను పోప్ రసవత్తరంగా మార్చాడు. ఓవర్కు 4.10 రన్రేట్తో పరుగులు చేసిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (47), జాక్ క్రాలీ (31), బెన్ ఫోక్స్ (34) పర్వాలేదనిపించారు. దీంతో ఓవరాల్గా ఇంగ్లండ్ 126 పరుగుల ఆధిక్యం సాధించింది. పోప్తో పాటు రెహాన్ అహ్మద్ (16) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 421/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా మరో 15 పరుగులు మాత్రమే జోడించి 436 పరుగులకు ఆలౌటైంది. జడేజా (87), అక్షర్ (44) ఎక్కువసేపు నిలువలేకపోయారు దీంతో భారత్కు 190 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం ప్రేక్షకులతో జనసంద్రమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గుతున్న వేళ.. హైదరాబాద్లో ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తుతున్నారు. గత మూడు రోజుల నుంచి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరవుతున్నారు. హైదరాబాద్ ఇప్పటి వరకు ఆతిథ్యమిచ్చిన తొమ్మిది టెస్టుల్లో ఎన్నడూ 20 వేల మంది అభిమానులు రాలేదని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్టుకు స్కూల్ విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు చెందిన జవాన్లు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. దీనిపై హెచ్సీఏ విస్త్రత ప్రచారం కల్పించడం బాగా కలిసొచ్చింది.