దుబాయ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ఆసీస్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ విజేతకు రూ. 13.05 కోట్లు (1.6 మిలియన్ యూఎస్ డాలర్లు) దక్కనున్నాయి. 16 జట్లు పాల్గొంటున్న వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఆరున్నర కోట్లు మూటగట్టుకోనుంది. గత ప్రపంచకప్ ప్రైజ్మనీనే కొనసాగించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న మెగాటోర్నీలో భారత్తో పాటు అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా సూపర్-12 స్థాయికి అర్హత సాధించగా.. మిగిలిన 8 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి.