సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 7: దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూ సేకరణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో కాలనీల్లో విద్యుత్, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీరు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం తప్పనిసరి అని, కాల్వల నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సమష్టిగా కాల్వల భూ సేకరణకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవాలు..
దుబ్బాక నియోజకవర్గవ్యాప్తంగా పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గవ్యాప్తంగా తుదిదశకు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గవ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా వచ్చే నెల 10 తేదీలోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.