రోడ్లపైకి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించిన పోలీసులు
ఉల్లంఘనలపై 2475 కేసులు
బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
సిద్దిపేట టౌన్, మే 26 :
సిద్దిపేటలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతుంది. బందోబస్తును పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం కరోనా నివారణకు విధించిన లాక్డౌన్ పటిష్టంగా అమలుపర్చాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సూచించారు. 10 గంటల వరకు అందరూ ఇండ్లలోకి చేరుకోవాలని లేదంటే కేసులు, జరిమానాలు విధించాలన్నారు. 15వ రోజు లాక్డౌన్లో భాగంగా సీపీ పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పనిపై బయటకు వెళ్లే వారికి ఆన్లైన్ ఈ పాసు ద్వారా ఇప్పటి వరకు 3572 ఈ పాసులను జారీ చేశామన్నారు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం 2475 ఈ పెట్టి కేసులు నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా 428 వాహనాలను సీజ్ చేశామన్నారు. బందోబస్తు పర్యవేక్షణను ఆయా డివిజన్ల ఏసీపీలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.