సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16 : పాలన సౌలభ్యం కోసమే సమీకృత భవనాలు ఏర్పాటు చేస్తున్నామని, సర్వహంగులతో జిల్లా కార్యాలయాల సమీకృత సముదాయం రూపుదిద్దుకుంటున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల పనులను మంత్రి హరీశ్రావు పరిశీలించారు. కలెక్టరేట్ భవనంలోని కార్యాలయాల సముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలిస్తూ.. కలియ తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఆధునాతన హంగులతో రూ.81కోట్లతో జిల్లా కార్యాలయాల సమీకృత భవన సముదాయం, పోలీస్ కమిషనరేట్ భవనాలు నిర్మించారన్నారు. సిద్దిపేట శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో జీ+2 విధానంలో పోలీస్ కమిషనరేట్ సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి కార్యాలయానికి శాఖల వారీగా సైన్ బోర్డులు పెట్టాలని సూచించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని
సందర్శించిన మంత్రి ..
సిద్దిపేట, జూన్ 16 : సిద్దిపేట హౌసింగ్ బోర్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం సందర్శించారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లపై పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి చర్చించారు.