సేవే లక్ష్యంగా.. సిద్దిపేట ఫౌండేషన్
సమాజ సేవలో సిద్దిపేట ఫౌండేషన్
పేదలకు అండగా సేవా కార్యక్రమాలు
ప్రతి నెల రూ.60వేలు వెచ్చిస్తూ ముందుకు
సిద్దిపేట టౌన్, మే 9 :
సిద్దిపేట కీర్తిని దేశ విదేశాల్లో చాటుతూ క్షణం తీరిక లేకుండా గడిపే ఆ బిడ్డ.. పురిటిగడ్డ కోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. చిన్నతనంలో నాటుకుపోయిన సేవా బీజాన్ని అతన్ని సమాజ సేవకు పునరంకితం చేసింది. ఐదు దేశాల్లో ఐటీ సంస్థలను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తూనే ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మరువకుండా మమకారం పెంచుకున్నాడు. సిద్దిపేట ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేదలకు బాసటగా నిలుస్తున్నాడు. సమాజం కోసం ఏదైనా చేయాలనే గొప్ప ఆలోచన వేలల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు. సిద్దిపేటకు చెందిన సాదత్ నజీర్. సింగపూర్ కేంద్రంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు సిద్దిపేటలోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ సేవలపై ప్రత్యేక కథనం.
బీజం పడిందిలా..
సిద్దిపేట శార్వదాన్కు చెందిన సాదత్ నజీర్ది మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. తండ్రి మిలటరీలో పనిచేసి దేశానికి సేవలందించాడు. చిన్నతనంలో తండ్రి ఖర్చులకు డబ్బులిస్తే అందులో కొంత భాగం పేదల సేవకు ఉపయోగించేవాడు. తండ్రి స్ఫూర్తితో నడువాలని సంకల్పించాడు. ముందుగా ఉన్నతంగా ఎదుగాలని నిర్ణయించుకున్నాడు. ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లాడు. సాధారణ ఉద్యోగిగా చేరిన అతను అంచెలంచెలుగా ఎదిగి ఐటీ సంస్థలు ప్రారంభించాడు. సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు సహాయం చేయాలని 2008లో సిద్దిపేట ఫౌండేషన్ సేవలు ప్రారంభించాడు. మొదట్లో రంజాన్, దసరా, క్రిస్మస్ పండుగలకు పేదలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేశారు. అలా ప్రారంభమైన సేవా కార్యక్రమాలు సిద్దిపేటతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహబూబ్నగర్, కడపలో ఫౌండేషన్ సేవలు కొనసాగిస్తున్నారు.
సింగపూర్ టు సిద్దిపేట
సిద్దిపేట ఫౌండేషన్ సేవలు సిద్దిపేట వేదికగా కొనసాగుతున్నాయి. తన ఇంటినే కార్యాలయంగా మలుచుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఫౌండేషన్ కన్వీనర్ లాయక్ సారథ్యంలో సేవలు నడుస్తున్నాయి.
వృద్ధులకు ప్రతి నెల రూ.500 చొప్పున 50 మంది నిరుపేదలకు అందజేస్తున్నారు.
ఉన్నత విద్యను అభ్యసించేందుకు నిరుపేద విద్యార్థులకు ఫౌండేషన్ బాసటగా నిలుస్తూ రూ.2 వేల నుంచి 5 వేల వరకు అందిస్తున్నది.
ఇలా ప్రతి నెలా ఫౌండేషన్ రూ.60 వేల వరకు వెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నది.
నిరుపేదల వివాహానికి రూ.15 వేల నుంచి 20 వేలు అందిస్తున్నది. నిరుపేద విద్యార్థిని హీనాబేగం ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 52 వేలు కళాశాలలో కట్టి పేద విద్యార్థిని ఉన్నత చదువుకు బాసటగా నిలిచింది.
కరోనా సమయంలోనూ ప్రతిరోజు 180 మందికి ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
వరంగల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించడంతో అక్కడ నిరుపేదలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పెద్దమనసు చాటింది. దసరా, రంజాన్,క్రిస్మస్ పండుగకు దుస్తులను, పంపిణీ చేస్తుంది.
పేదలకు అండగా ఉంటా..
పేదల జీవితాల్లో చెరగని నవ్వును చూడాలని ఫౌండేషన్ స్థాపించాం. సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజ సేవకు వినియోగించాలని సంకల్పించా. సింగపూర్ వేదికగా సేవలు కొనసాగిస్తున్నాను. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం మరువలేనిది. 12 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్న. పేదలకు జీవితాంతం అండగా ఉంటూ సేవలను అందిస్తా.
సాదత్ నజీర్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు