గజ్వేల్ అర్బన్ / వర్గల్ / మర్కూక్, ఏప్రిల్ 5 : రైతుల విజ్ఞప్తి మేరకు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడడానికి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మంగళవారం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారు. హల్దీవాగు, గజ్వేల్ కాల్వల్లోకి గోదావరి జలాలను సీఎం విడుదల చేస్తారు. సోమవారం మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద గజ్వేల్ కెనాల్, వర్గల్ నవోదయ గురుకుల పాఠశాల వద్ద హల్దీవాగులోకి నీటిని మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాల్వల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు అవుసులపల్లి నవోదయ పాఠశాల వద్ద సంగారెడ్డి కాల్వ నుంచి హల్దీ కాల్వలోకి మొదటగా సీఎం కేసీఆర్ గోదావరి జలాలను విడుదల చేస్తారు. అనంతరం 11.15గంటలకు మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గజ్వేల్ కాల్వలోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. సంగారెడ్డి కెనాల్ ద్వారా మళ్లించిన గోదావరి జలాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్వ ద్వారా చౌదరిపల్లి బంధం చెరువు, వర్గల్ పెద్దచెరువు, శాకారం దమ్మాయి చెరువు, అంబర్పేట ఖాన్చెరువు ద్వారా నాచారం వద్ద హల్దీవాగులోకి ప్రవేశించనున్నాయి.
8నుంచి 10 రోజుల్లో హల్దీవాగు, మంజీరా నదిలో గోదావరి జలాలు చేరి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవేశిస్తాయని ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గజ్వేల్ కెనాల్ ద్వారా గజ్వేల్ ప్రాంతంలోని అన్ని చెరువుల్లోకి నీటిని విడుదల చేయడంతో ఒక్కొక్కటిగా చెక్డ్యాంలు నిండి తిరిగి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వెళ్లనున్నాయి. ప్రతిరోజు 1600ల క్యూసెక్కుల నీటిని కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వేలాది మంది రైతులు, ప్రజల సమక్షంలో ఆడంబరంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని, కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాబట్టి ప్రజలంతా సహకరించాలని కోరారు. పంటలు కాపాడడానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
యాసంగి పంటకు సాగునీటి కొరత తీరింది. జిల్లాలో ఉన్న కూడవెల్లి, హల్దీ రెండు ప్రధాన వాగుల్లో ఎండాకాలంలో నిండుగా గోదావరి జలాలు పారించడంతో పరిసర ప్రాంత వ్యవసాయ పంటలకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. వేలాది ఎకరాల్లో పొట్ట, గింజ గట్టిపడే దశల్లో ఉన్న వరి పైరుతో పాటు ఇతర పంటలకు మేలు జరుగుతుంది. మునిపటిలాగా బోర్లు వేయడం, ఇతర ప్రయత్నాలు రైతు నయాపైస ఖర్చు చేయకున్నా వాగులపై ఉన్న చెక్డ్యాంలు నిండడంతో భూగర్భ జలాలు పెరిగి, పంటలు సమృద్ధిగా పండటానికి వీలు కల్గుతుంది. కూడవెల్లి వాగు చెక్డ్యాంలు పొంగి పొర్లుతుండగా, ఇక మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హల్దీవాగుకు, గజ్వేల్ కాలువకు కొండపోచమ్మ నుంచి నీరు వదలడంతో ఉమ్మడి మొదక్ జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే పంటలు సమృద్ధిగా పండడానికి సాగు నీరు సమకూరుతుంది.
పెద్ద ఎత్తున పంటల సాగు…
హల్దీవాగు పరిధిలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు వరి పంట కీలక దశలో ఉంది. యాసంగిలో మునుపెన్నడు లేనంతగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. బోర్లు అన్నీ పనిచేయడంతో భూగర్భజలాలు బాగా పడిపోయాయి. మరో 20 నుంచి నెల రోజుల వరకు వరి పైరుకు సాగునీరు అవసరం. ఈ దశలో నీటి కొరత ఏర్పడితే పైరు ఎండి రైతు నష్టపోతాడు. అయితే కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువుకుంటలు, చెక్డ్యాంల్లోకి నీరు వదలడంతో అనేక ఎకరాల్లో వరి పంటకు మేలు జరుగుతుంది. ఇది కాలువల ద్వారా జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను సీఎం కేసీఆర్ అందించడం చారిత్రకం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం రైతులకు గొప్ప మేలు చేస్తుంది. ఇప్పటికిప్పుడు హల్దీవాగులోకి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేయడంతో 14,265 ఎకరాల్లో ఎండిపోయే పంటలకు జీవం పోసినట్లు అవుతుంది.
నదులకే నడకను నేర్పిన కేసీఆర్
వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండి వాగుల్లో పారి నదుల్లో చేరి సముద్రంలో వరదనీరు కలిసేది. ఇప్పుడు నదీ జలాలు ఎత్తైన ప్రాంతానికి వచ్చి, తిరిగి వర్షాకాలంలో లాగా వాగుల నుంచి ప్రాజెక్టులకు చేరుతున్నాయి. ఇది కేసీఆర్ కాలేశ్వరం ఎత్తిపోతల ద్వారా సృష్టించిన మరో అద్భుతం. వానకాలంలో ఈ ప్రాంతం నుంచి పారిన నీరు కాళేశ్వరం ఎత్తిపోతలతో తిరిగి కొండపోచమ్మ సాగర్ను నింపుకుని, అక్కడ నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా హల్దీ వాగు, ఆ తర్వాత మంజీరా ద్వారా నిజాంసాగర్ వరకు గోదావరి జలాలు పారడం సీఎం కేసీఆర్ చేసిన గొప్ప ప్రయోగంగా మంత్రి హరీశ్రావు పేర్కొవడంపై రైతులు ఊహించని వాస్తవంగా చెప్పుకుంటున్నారు. సంగారెడ్డి కాలువ నుంచి చౌదర్పల్లి బంధం చెర్వుకు లింక్ కాలువను తవ్వారు. బంధం చెరువు నుంచి 6.2కిలో మీటర్ల పీడర్ కెనాల్ను తవ్వి వర్గల్ పెద్ద చెర్వును నింపుతారు. అక్కడి నుంచి ఖాన్ చెరువు ద్వారా హల్దీవాగులోకి గోదావరి జలాలు చేరుతాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో హల్దీ వాగులో 70 కిలోమీటర్లు, మంజీరా నదిలో మరో 20 కిలోమీటర్లు గోదావరి నీళ్లు పరుగులు తీయనున్నాయి. రైతుల కోసం గోదావరి జలాలను వృత్తాకారంలో తిప్పిన సీఎం కేసీఆర్ రూపొందించిన మరో గొప్ప కార్యంగా ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బహుళార్థక ప్రాజెక్టు…
కాళేశ్వరం ఎత్తిపోతలు బహుళార్ధక ప్రాజెక్టుగా మారుతున్నది. సాగు, తాగునీరు అందించడమే కాకుండా మత్స్య అభివృద్ధి. పారిశ్రామిక పురోగతికి ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్రావు వర్గల్లో సోమవారం అన్నది ఇప్పటికే స్పష్టం అవుతున్నది. పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగగా, తాగునీటి కొరత తీర్చింది. పుష్కలంగా ఈ ప్రాంతంలో చేపలు సామాన్యులకు అందుబాటులోకి రాగా, పరిశ్రమలు తరలివస్తున్నాయి. వీటన్నిటింతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా వృద్ధి చెందగా, రైతుల స్థిరాస్తుల విలువలు బాగా పెరిగాయి.
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పర్యటన నేసథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం జలాలను గజ్వేల్ కాల్వలోకి మర్కూక్ మండలం పాములపర్తి, వర్గల్ మండలం అవుసులోనిపల్లి పాయింట్ల వద్ద నీటిని విడుదల చేస్తారని, ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ముగిసే వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని, ఉదయం 10.30గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగులోకి గోదావరి జలాలను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని తెలిపారు. అనంతరం 11.15 గంటలకు మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన గజ్వేల్ కెనాల్లోకి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు అదనపు ఏస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 37మంది ఎస్సైలతో పాటు ఏఆర్ సిబ్బంది, బీడీ టీమ్స్, రోప్ పార్టీ, స్పెషల్ పార్టీలతో కలిపి 500 మందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వాహనాల పార్కింగ్ ప్రదేశాలు..
అవుసులోనిపల్లి వద్ద వీఐపీ పార్కింగ్ కెనాల్కు కుడి పక్కన ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశామని, వివిధ శాఖల అధికారులు పార్కింగ్ చేసుకునే ప్రదేశాలను నవోదయ పాఠశాల, అవుసులోనిపల్లి రెడ్మిక్స్ ఫ్యాక్టరీ పక్కన, గజ్వేల్ కెనాల్ వద్ద కుడివైపున ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు సీపీ జోయల్ డెవిస్ మంత్రి హరీశ్రావు, కలెక్టర్ వెంక్రటామ్రెడ్డితో కలిసి కెనాల్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
ఇవీ కూడా చదవండి…