సిద్దిపేట టౌన్ : అమ్మ అంశం తరగని నిధి.. సాహిత్యం, అమ్మ ఔన్నత్యం ఎల్లప్పుడూ వర్ధిల్లుతుందని ప్రముఖ కవి డా.నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ రచయితల సంఘం సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్క్లబ్లో చెన్నోజు శ్యామల స్మృతిలో రూపొందించిన అమ్మ కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ విలువలు తరిగిపోతున్నాయని, అమ్మ ప్రేమను గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తరతరాల సాహిత్యంలో అమ్మ చెరగని సంతకం చేస్తుందన్నారు. రేపటి తరాలకు అమ్మ విలువ అనివార్యమని ఆయన అన్నారు. అంతకుముందు ప్రముఖ కవి అంజయ్య అమ్మ కవితా సంకలనాన్ని సభకు పరిచయం చేశారు. అమ్మశీర్షికన ఆన్లైన్లో కవితా పోటీలు నిర్వహించగా దేశ నలుమూలల నుంచి 151 మంది కవులు తమ కవితలు పంపించారు. వాటిని రెండు దశల్లో పరిశీలించి విజేతలను ఎంపిక చేసినట్లు మంజీర రచయితల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అశోక్, సంఘ జిల్లా అధ్యక్షుడు బాలయ్య తెలిపారు.
కార్యక్రమంలో మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, సంఘ ప్రధాన కార్యదర్శి గంభీర్రావుపేట యాదగిరి, తెలంగాణ నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ మహేందర్, ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్, కవులు సిద్దెంకి యాదగిరి, రాజిరెడ్డి, కృష్ణమూర్తిగౌడ్, కొమురవెల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.