సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానకు అక్కన్నపేట మండలం గౌరవెల్లి పాత చెరువుకు గండి పడింది. ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని ఇండ్లు నీటమునిగాయి, గ్రామంలోని పంట పొలాలు, రహదారిపై నీరు ప్రవహిస్తున్నది.
బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సిద్దిపేట-హనుమకొండ రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. ఈనేపథ్యంలో రాకపోకలు స్తంభించాయి. వరదలో ఓ లారీ చిక్కుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నంగునూరు మండలం అక్కెనపల్లి వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కరీమాబాద్, సాకరిశికుంట, ఏకశిలానగర్లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వర్షం కురుస్తున్నది.
నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిడమనూరు మండలం ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.