అలంపూర్, జూలై 2: ఏ ప్రాంతంలోనైనా కులాల వారీగా, మతాల వారీగా ఉత్సవాలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే అలంపూర్ క్షేత్రంలో హిందూముస్లింలు కలిసికట్టుగా జోగుళాంబ బాలబ్రహ్మేశరస్వామి ఆలయ పరిసరాల్లో ఉర్సు జరుపుకోవడం ప్రత్యేకం. పట్టణంలో షాఅలీ పహిల్వాన్ వర్ధంతి రోజున ఉర్సు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి 7వ తేదీ వరకు ఉర్సు జరుగనున్నది. నిజాం కాలంలో ఢిల్లీ నుంచి మత ప్రచారంలో భాగంగా షాఅలీ పహిల్వాన్ అలంపూర్ ప్రాంతాన్ని సందర్శించినట్లు పెద్దలు చెబుతున్నారు. రాజులకు పహిల్వాన్కు జరిగిన యుద్దంలో పహిల్వాన్ వీర మరణం పొందారు.
రెండు దర్గాలు
సాధారణంగా మత గురువులకు యోధులకు మరే ఇతర ప్రముఖులకైనా మరణానంతరం ఒకే దర్గా ఉంటుంది. అయితే అలంపూర్లో షా అలీ పహిల్వాన్కు రెండు దర్గాలున్నాయి. యుద్దంలో వీర మరణం పొందిన పహిల్వాన్ పార్థివదేహం రెండు భాగాలుగా విడిపోయింది. తల భాగం పడిన చోట శిర్ ముబారక్ (చిన్న దర్గా)అని, మొండెం భాగం పడిన చోట దడ్ ముబారక్ (పెద్ద దర్గా) అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. రెండు దర్గాలు నేటివరకు ప్రజాదరణ పొందుతున్నాయి. రెండు దర్గాల వద్ద ఉర్సు నిర్వహిస్తారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో నిర్వహించే ఖాజా బందే నవాజ్ ఉర్సు ఉత్సవాల అనంతరం ఏడు రోజులకు ఏటా అలంపూర్లో ఉర్సు ప్రారంభిస్తారు.
మహిళా కిస్తీలు
మొదటిరోజు గంధం, రెండోరోజు చిన్న కిస్తీలు, మూడో రోజు పెద్ద కిస్తీలు, నాలుగో రోజు మహిళల ఉర్సు నిర్వహిస్తారు. ఎక్కడా లేని విధంగా అలంపూర్ షాఅలీ పహిల్వాన్ ఉర్సులో మహిళలు ప్రత్యేకించి కిస్తీలు నిర్వహిస్తారు. ఆ రోజు కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారు సెక్యూరిటీ సిబ్బంది కూడా మహిళా పోలీసులే ఉంటారు. పురుషులకు ప్రవేశం ఉండదు.
అధికారికంగా గంధం
వందల సంవత్సరాలుగా అలంపూర్ ప్రాంతంలో కులమతాలకతీతంగా ఉర్సు నిర్వహిస్తున్నారు. వంశ పారంపర్యంగా మత పెద్ద, ఉర్సు నిర్వాహకుడు ఖాదర్వలీ ఆయన వారసులు సొంత ఖర్చులతో ఉర్సు నిర్వహిస్తున్నారు. అధికారికంగా తాసిల్దార్ చేతుల మీదుగా గంధం ఊరేగింపు కొనసాగిస్తారు.
పొలావే మహాప్రసాదం
అలంపూర్ ఉర్సులో పొలావునే ప్రసాదంగా వితరణ చేస్తారు. భక్తులు వారి ఇండ్ల వద్ద దర్గాకు సమర్పించాల్సిన ప్రసాదాన్ని వండి తెచ్చిన వేడి వేడి పొలావును దర్గా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాతి పడవలో పోస్తారు. కొంతమంది ఫహిల్వాన్లు వేడి వేడి పొలావును చేతులతో పట్టుకుని భక్తులపైకి విసురుతారు. విసిరేసిన పొలావును పట్టుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. అదేవిధంగా ఉర్సును తిలకించడానికి హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి తరలొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఉర్సుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో రాములు తెలిపారు.
ఉర్సు కార్యక్రమాలు
మొదటిరోజు శనివారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి తెచ్చిన గంధం అలంపూర్ ఉర్సు నిర్వాహకుల ఇంట్లో ఉంచి ప్రత్యేక ప్రార్థల అనంతరం తాసిల్దార్ కార్యాలయానికి చేరుస్తారు. అక్కడి నుంచి అధికారికంగా తాసిల్దార్ తలపై పెట్టుకుని మేళతాళాల మధ్య దర్గాకు తరలిస్తారు. 4వ తేదీ చిన్న కీస్తీలు, 5వ తేదీన పెద్ద కిస్తీలు, 6వ తేదీన మహిళా ఉర్సు నిర్వహిస్తారు. ఉర్సులో పాల్గొనడానికి హైదరాబాద్, రాయచూరు, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి ఫకీర్లు వచ్చి ఖవ్వాలి నిర్వహిస్తారు.