గజ్వేల్ అర్బన్, మార్చి 5 :నేడు అపురూప ఘట్టాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం గజ్వేల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హల్దీ, మంజీర నదులకు మండుటెండల్లో గోదావరి జలాలను విడుదల చేయనున్న ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా, అతి గొప్పగా నిర్వహించుకోవాల్సిందని, కానీ.. ఈ కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు హాజరుకావాలన్న ఆకాంక్ష ఉన్నా రావొద్దని చెప్పామని, కొద్దిమంది రైతులు, ప్రజాప్రతినిధుల మధ్య మాత్రమే నిర్వహించుంటున్నామన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి ప్రజలంతా మంచి మనసుతో సహకరించాలని మంత్రి హరీశ్రావు కోరారు. నేడు చరిత్ర తిరగరాసే రోజు అని, నదికి సీఎం కేసీఆర్ కొత్త నడక నేర్పుతున్నారన్నారు.
హల్దీవాగు పొంగితే మంజీర నది నిండి నిజాంసాగర్లోకి, అక్కడి నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోని జలాలు వెళ్లేవన్నారు. కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ ప్రతిభతో గోదావరి జలాలను కొండపోచమ్మ ద్వారా హల్దీవాగులోకి పంపుతున్నామని తెలిపారు. చరిత్రను తిరగరాసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని, అంతటి నాయకుడు మరెక్కడా ఉండబోరన్నారు. ఆ రోజుల్లో నీళ్లు తెస్తామంటే ఎవరూ నమ్మలేదని, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని పనికిమాలిన ఆరోపణలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అద్భుతమైన పనులతో వారి నోటికి తాళాలు పడ్డాయన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం గోదావరి జలాలు 600 కిలోమీటర్లు ప్రయాణించి హల్దీవాగులోకి చెరువులు, చెక్డ్యాంలు దాటి వెళ్తాయని, 70కిలోమీటర్లు హల్దీవాగులో ప్రయాణించి మంజీర నదిలోకి చేరుతాయన్నారు. మంజీర నదిలో 20 కిలోమీటర్లు ప్రయాణించి నిజాంసాగర్లోకి చేరుతాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గజ్వేల్ నుంచి సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వేల్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు.
తెలంగాణలో అతి ఎత్తైన ప్రాంతం ఇదే నని, 100మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నది నుంచి సముద్రమట్టానికి 618మీటర్లు ఎత్తు ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం, ఇక్కడికి గోదావరి జలాలు తీసుకురావడంతో సీఎం కేసీఆర్ జన్మ చరితార్థమయ్యిందన్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతి మరోటి మానవ జన్మకు ఉండదన్నారు. ఈ ప్రాంతంలో యాసంగి పంట కాలంలో అప్పులు చేసి ఎన్నో బోర్లు వేయడం, నీరు పడకపోవడంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో అనేక సంఖ్యలో చూశామని గుర్తు చేశారు. ఇలాంటి ప్రాంతానికి గోదావరి జలాలు ఇచ్చి బంగారు పంటలు పండించుకోబోతున్నామన్నారు. 14,268 ఎకరాల పంటలను కాపాడుకోవడానికి హల్దీ, మంజీర నదుల ద్వారా నిజాంసాగర్కు నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ హల్దీవాగులో మొత్తం 32 చెక్డ్యాంలు ఉండగా, గజ్వేల్ నియోజకవర్గంలో 18, నర్సాపూర్లో 10, మెదక్ నియోజకవర్గంలో 4 చెక్డ్యాంలు నిండుకుంటూ నిజాంసాగర్కు చేరుకుంటాయన్నారు.
ఈ చెక్డ్యాంలలో 0.62 టీఎంసీ నీరు నిల్వ ఉంటుందని, చెక్డ్యాంలను నింపుకుంటూ నిజాంసాగర్లోకి చేరుతాయన్నారు. రైతుల పంటలు కాపాడడానికి ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రైతులు, జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతాంగం, రాష్ట్రం బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను నిర్మించారని, భవిష్యత్తులో మల్లన్నసాగర నుంచి తాగునీటిని వినియోగించుకుంటామన్నారు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చి భూసేకరణకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు. శామీర్పేట, మేడ్చల్ ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కూడా నీటిని అందించే అవకాశం ఉందని, మల్లన్నసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అన్నారు. పర్యాటకంగా కూడా మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. ఇప్పటికే కొండపోచమ్మ వద్దకు శని,ఆదివారాల్లో పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తున్నారని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మత్స్య కారులకు కూడా చేపల పెంపకంతో మంచి ఉపాధి లభిస్తుందన్నారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి , కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
అభివృద్ధికి ‘సిద్దిపేట’ మారుపేరు