లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో లక్నో, వారణాసి సహా పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం ప్రకటించింది. లక్నో, ప్రయాగరాజ్, వారణాసి, కాన్పూర్, గౌతంబుద్ధనగర్, ఘజియాబాద్, మీరట్, గోరఖ్ పూర్ సహా పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ తక్షణమే అమలవుతుందని యూపీ సీఎం కార్యాలయం వెల్లడించింది.
కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇక మే 15 వరకూ స్కూళ్లను మూసివేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మే 20 వరకూ పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేశారు. యూపీలో నిన్న ఒక్కరోజే రికార్డు స్ధాయిలో ఏకంగా 20510 పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.