న్యూఢిల్లీ : ఐఫోన్లను స్ధానికంగా తయారు చేసేందుకు దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు యాపిల్ సరఫరాదారు విస్ట్రన్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఐఫోన్ల తయారీ కోసం ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జాయింట్ వెంచర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపడుతోందని బ్లూంబర్గ్ తాజా రిపోర్ట్ పేర్కొంది. చైనాపై ఆధారపడటం తగ్గించే క్రమంలో భారత్లో ఐఫోన్ల తయారీ కోసం తైవానీ సరఫరా సంస్ధతో టాటా గ్రూపు భాగస్వామ్యానికి టాటా కసరత్తు సాగిస్తోంది.
తన సరఫరాదారుల సాయంతో ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11 సహా ఎంపిక చేసిన పలు ఐఫోన్ మోడల్స్ అసెంబ్లింగ్ను భారత్లో ఇప్పటికే యాపిల్ చేపట్టింది. ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగట్రాన్లతో భాగస్వామ్యంతో కంపెనీ ఈ ఐఫోన్ మోడల్స్ తయారుచేస్తోంది. కాగా తైవానీ దిగ్గజం విస్ట్రన్ భాగస్వామ్యంతో భారత్లో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూపు సన్నద్ధమైంది. స్ధానికంగా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి తొలిసారిగా టాటా గ్రూపు అడుగు పెడుతోంది.
కంపెనీ భారత్లో ప్రస్తుతం సాల్ట్, కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సాఫ్ట్వేర్ సహా పలు రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక టాటా అనుబంధ కంపెనీ ఇన్ఫినిటీ రిటైల్ క్రోమా స్టోర్స్ను నిర్వహిస్తోంది. కాగా విస్ట్రన్తో కలిసి టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీలోకి అడుగుపెడుతుండటంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా భారత్లో ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా నిలిచేందుకు టాటా ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. భారత్లో ఐఫోన్ల తయారీని టాటా చేపడితే పలు గ్లోబల్ టెక్ కంపెనీలు మేకిన్ ఇండియా బాటలో ఇతర దేశాలకు ఉత్పత్తుల ఎగుమతులు చేసేందుకు చొరవ చూపుతాయని భావిస్తున్నారు.