న్యూయార్క్ : ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సూచించారు. ఉద్యోగులు తమ సత్తా చాటేందుకు తదుపరి ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రస్తుత ఉద్యోగంలోనే మెరుగైన పనితనం కనబరచాలని అన్నారు.
1992లో తాను తొలిసారి ఆఫీస్లో అడుగుపెట్టిన సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం తనకు ఉందని, ఇంతకుమించి తనకేదీ అవసరం లేదని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యేవరకూ సత్య నాదెళ్ల కంపెనీలోని వివిధ విభాగాల్లో పలు హోదాల్లో పనిచేశారు. కంపెనీ సీఈఓగా నియమితులైనప్పటి నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పనిచేసే విధానాన్ని సమూలంగా మార్చివేశారు.
న్యూ బింగ్ ఆవిష్కరణతో ఏఐ టెక్నాలజీపై మైక్రోసాఫ్ట్ సరికొత్తగా దృష్టి సారించింది. మీరు ఏం చేస్తారనేదానిపై మీ వృద్ధి ఆధారపడి ఉంటుందని ఆలోచించనంతవరకూ మీరు ఎదగలేరని లింక్డిన్ సీఈఓ ర్యాన్ రోలన్స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్లో తన 30 ఏండ్ల ప్రస్ధానంలో తన పనిని ఎన్నడూ తేలికగా తీసుకోలేదని, తాను పనిచేసే ఉద్యోగం ఎంతో కీలకమైనదని భావించే వాడినని చెప్పుకొచ్చారు.
Read More :