అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 20: మున్సిపాలిటీలోని ఆదర్శనగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బస్తీబాటలో భాగం గా మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్, మధురానగర్ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీధిదీపాలు, పింఛన్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న భగీరథ పనులు పూర్తయిన వెంటనే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతామన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలు ప్రతిపక్షాల మాటలకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మధురానగర్ కాలనీలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించి పనుల్లో పారదర్శకతను పాటిస్తూ త్వరగా పూర్తి చేసేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ తులసీరాం, నాయకులు నర్సింహగౌడ్, ఖలీల్, నిజాం, రహమతుల్లా, రమేశ్రావు, శివ తదితరులు ఉన్నారు.
అమ్రాబాద్లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెక్కులు పంపిణీ చేశారు. 65మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, తాసిల్దార్ లక్ష్మిదేవి, ఆర్ఐ కృష్ణాజి, రామస్వామి, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.