భద్రాచలం/దమ్మపేట, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరులకు పూజలు చేసిన ఆయన.. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలను సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్, మోరంపూడి ప్రసాద్, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ ఉన్నారు.
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్దేనని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని మామిడి తోటలో మంగళవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్కి.. పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్కు సింగరేణితో రాష్ట్ర వాటా నిధులు ఇప్పించి సత్తుపల్లి వరకు రైల్వేలైన్ పూర్తి చేయడమే అభివృద్ధిపై కేసీఆర్కున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మట్టి, ఇసుక దందాతో దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని, యాసంగిలో పండించిన ధాన్యం కొనే దిక్కులేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నదని మండిపడ్డారు.