జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం, ఏప్రిల్ 23: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో టెస్టింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బరాజ్లోని గేట్ల వద్ద ఉన్న ఇసుకను తీసి టెస్టింగ్ పనులు నిర్వహించాలని గతంలోనే ఎన్డీఎస్ఏ అధికారులను ఆదేశించింది. అయినా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికారులు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం అన్నారం బరాజ్లోని గేట్ల వద్ద ఉన్న ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో మంగళవారం నుంచి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్ పొడవునా మొత్తం 2.54 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు అధికారులు అంచనా వేయగా, బరాజ్లోని గేట్ల వద్ద ఉన్న 6.20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే తీసేందుకు అనుమతి వచ్చినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఈ మేరకు టీఎస్ఎండీసీ పనులు ప్రారంభించింది. అన్నారం బరాజ్లో ఏర్పడిన చిన్న సీపేజ్లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ జనవరిలోనే ట్రీట్మెంట్ పూర్తి చేసింది. బరాజ్లోని 38, 28పాటు 35వ ఔట్లెట్స్లో కనిపించిన సీపేజ్లకు పాలి యూరిత్రిన్ కెమికల్తో గ్రౌటింగ్ చేసి అరెస్టు చేశారు. 15 రోజులపాటు అబ్జర్వేషన్ పీరియడ్ సైతం పూర్తి చేశారు. ఇన్వెస్టిగేషన్ సంస్థ పార్సన్ పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే బరాజ్ గేట్ల వద్ద భారీగా ఇసుక ఉండటంతో ఇన్వెస్టిగేషన్ పనులకు ఆటంకం ఏర్పడింది. సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ, రాష్ట్ర డ్యాం సేప్టీ బృందాలు సైతం అన్నారం బరాజ్ను సందర్శించి సీపేజ్లను పరిశీలించాయి. బరాజ్లో సీపేజ్లను అరికట్టడంలో అధికారులు సక్సెస్ అయ్యారని, అయితే సీపేజ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా.. క్రాక్లు ఏర్పడ్డాయా.. లోపాలుంటే చేయాల్సిన పనుల గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎన్డీఎస్ఏ బృందం ఇరిగేషన్ అధికారులకు సూచించింది. ఇందుకోసం బరాజ్లోని నీటిని పూర్తిగా వదిలేసి, 250 మీటర్ల ఇసుక తీసి టెస్టింగ్ పనులు చేయాలని కోరింది. అధికారులు ప్రభుత్వ అనుమతి తీసుకుని నీటిని వదిలేశారు. ఇప్పుడు ఇసుక తొలిగింపుకు అనుమతి రావడంతో టీఎస్ఎండీసీ పనులను ప్రారంభించింది. ఇసుకను తీసేందుకు నెల రోజులు పట్టే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇసుక పూర్తిగా తీసిన వెంటనే పార్సన్ సంస్థ ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభించనుంది.
డ్యాం సేప్టీ యాక్టు ప్రకారం ఇరిగేషన్ అధికారులు ప్రీ మాన్సూన్, పోస్టు మాన్సూన్ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అందించాల్సి ఉన్నది. బరాజ్ ఎగువ ప్రాంతంలో వర్షాకాలం తరువాత టెస్టింగ్లు నిర్వహించి పోస్టుమాన్సూన్ సర్టిఫికెట్, వర్షాకాలం ముందు టెస్టింగ్ నిర్వహించి ప్రీమాన్సూన్ సర్టిఫికెట్లను ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది.