హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో గోదావరి సత్యానారాయణమూర్తి (ఏ3), పెంట భరత్కుమార్ (ఏ4), పెంట భరణికుమార్ (ఏ5) అనే వ్యాపారులున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. ఈ ముగ్గురి ద్వారానే శివబాలకృష్ణ తతంగాన్ని నడిపినట్టు ఏసీబీ గుర్తించింది.
శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన సొమ్మును వీరికి చేరవేయగా.. వారు తమ పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ ఆస్తులను ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బును వివిధ దారుల్లో శివబాలకృష్ణకు ఇచ్చేవారని సమాచారం. ఈ ముగ్గురూ భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ విచారణలో తేలింది.ఈ కేసులో ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని సమాచారం.