దావోస్ : 6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు. 6జీ మొబైల్ నెట్వర్క్లు ఒకసారి పనిచేయడం ప్రారంభిస్తే ఇప్పుడు మనకు తెలిసిన స్మార్ట్ఫోన్లు పనికిరావని, అప్పటికి ఇవి కామన్ ఇంటర్ఫేస్లో ఉండవని లుండ్బెర్గ్ అన్నారు. ఇప్పుడు వాడే డివైజ్ల్లో చాలా వరకూ మన శరీరంలో ఇన్బిల్ట్గా వస్తాయని సంకేతాలు పంపారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో నోకియా చీఫ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కామన్ ఇంటర్ఫేస్గా అందరూ ఉపయోగించే స్మార్ట్ఫోన్ల స్ధానంలో ఏ డివైజ్ ముందుకొస్తుందనే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. న్యూరాలింక్ వంటి పలు కంపెనీలు శరీరంలో నిక్షిప్తం చేసే చిప్స్ నిర్మాణం, అభివృద్ధిపై కసరత్తు సాగిస్తున్నాయి. 6జీ నెట్వర్క్లు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున వీటికి ఒక నిర్ధిష్ట నిర్వచనం ఇప్పటివరకూ అందుబాటులో లేదు.
ఇక లుండ్బెర్గ్ తన ప్రసంగంలో భౌతిక, డిజిటల్ ప్రపంచాలు కలిసికట్టుగా వృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి మెటావర్స్ వంటి కాన్సెప్ట్లు 6జీతో ముందువరుసలో నిలవనున్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)ని సపోర్ట్ చేసే డివైజ్లు రాబోయే సంవత్సరాల్లో మొబైల్ వరల్డ్ను శాసించవచ్చని భావిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు 6జీ నెట్వర్క్లకు సిద్ధమవుతుండగా భారత్ వంటి దేశాలు ఇంకా 5జీ నెట్వర్క్లో అడుగుపెట్టలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం జరగనుండగా ఆపై కమర్షియల్గా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చే ప్రక్రియ షురూ కానుంది.