న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI)తో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అయితే లేటెస్ట్ టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ స్పష్టం చేశారు. ఏఐతో లక్షలాది కొలువులు కనుమరుగవుతాయనే అంచనాలను తోసిపుచ్చే రీతిలో స్మిత్ వ్యాఖ్యానించారు. ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణ అనంతరం అది భవిష్యత్ నాలెడ్జ్కు ఎలా పునాదులు వేసిందో ఏఐ ఆవిష్కరణ సైతం టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తుందన్నారు.
వచ్చే నెలలో జీ20 సదస్సుకు ముందు ఢిల్లీలో జరిగిన ప్రపంచ వ్యాపార దిగ్గజాల భేటీ నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఏఐతో ఎదురయ్యే ముప్పు, చాట్జీపీటీ వంటి జనరేటివ్ టూల్స్ భవిష్యత్ గురించి కూడా స్మిత్ ముచ్చటించారు. ఏఐ టూల్స్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని, అయితే అవి మానవ నియంత్రణలో ఉండేలా వాటిపై పర్యవేక్షణ అవసరమని నొక్కిచెప్పారు.
ఏఐ టూల్ ప్రజలు చురుకుగా ఆలోచించేందుకు సాయపడుతుందని, సమాధానాలను వేగంగా అందిస్తుందని, అయితే మనం ఆలోచించడం నిలిపివేయకూడదని అన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, పనులు విజయవంతం అవుతాయని, దీంతో ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం సులువవుతుందని చెప్పుకొచ్చారు. ఏఐతో మరింత వృద్ధి, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ అధినేత పేర్కొన్నారు. వ్యాధులను గుర్తించడంలో ఏఐ వైద్యులకు సాయపడుతుందని, వ్యాధులను నయం చేసే మందుల ఆవిష్కారానికి దారి చూపుతుందని అన్నారు. విద్యార్ధులకు ట్యూటర్లుగా, పిల్లలతో పనులు చేయించేందుకు పెద్దలకు ఉపకరిస్తుందని అన్నారు.
Read More :
Code Llama VS ChatGPT | చాట్జీపీటీకి దీటుగా కోడ్ లామా లాంఛ్..మెటా ఏఐ టూల్తో ఎవరికి వరం.!