న్యూఢిల్లీ : మాస్ లేఆఫ్స్ నుంచి ఐటీ రంగం ఇంకా కోలుకోకపోవడం టెకీల్లో గుబులు రేపుతోంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు కొలువుల కోతను కొనసాగిస్తుండటంతో జాబ్ మార్కెట్లో నిస్తేజం నెలకొంది. వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో ముందుగా ఉద్యోగులపైనే వేటు వేస్తుండటం కలవరం కలిగిస్తోంది. మరికొన్ని కంపెనీలు విస్తరణ కార్యకలాపాలను అటకెక్కించడంతో ఐటీ వృద్ధిపైనా ప్రభావం చూపుతోంది.
ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తోందోనని ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. హైరింగ్నూ నిలిపివేసిన కంపెనీలు తాజాగా క్యాంపస్ హైరింగ్స్కూ ( Campus Hiring) బ్రేక్ వేయడం ఫ్రెషర్స్లో నైరాశ్యానికి దారితీస్తోంది. లేటెస్ట్గా ఈ ఏడాది కాలేజ్ల నుంచి ఫ్రెషర్స్ నియామకాలు ఉండవని దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కుండబద్దలు కొట్టింది.
కంపెనీలో ఇప్పటికే తగిన సంఖ్యలో ఫ్రెషర్స్ ఉండటంతో నూతనంగా ఫ్రెషర్స్ నియామకానికి ఇన్ఫోసిస్ మొగ్గుచూపడం లేదు. అయితే గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్స్కు అనుగుణంగా ఆయా అభ్యర్ధులను విధుల్లోకి తీసుకునేందుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా వంటి కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ లేమితో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్పై ఇన్ఫోసిస్ వెనుకంజ వేస్తోంది. కంపెనీ సీఈవో, ఎండీ సలిల్ పరేఖ్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
Read More :