న్యూఢిల్లీ, అక్టోబర్ 12: వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఆరేండ్లలో కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ దాదాపు రూ.16,000 కోట్ల పెట్టుబడుల్ని (2 బిలియన్ డాలర్లు) పెట్టాలని యోచిస్తున్నది. 2030కల్లా తమ హైపర్స్కేల్ డాటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోవడానికి, కార్బన్ న్యూట్రల్గా అవతరించడానికి ఈ పెట్టుబడులను వినియోగించుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు గురువారం సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కంట్రోల్ఎస్కు 234 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 డాటా సెంటర్లున్నాయి.
హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా, లక్నో, పాట్నాల్లో కంట్రోల్ఎస్కు ఈ డాటా కేంద్రాలున్నాయి. కాగా, భారత్, కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో తమకు ఇప్పటికే ఉన్న హైపర్స్కేల్, ఎడ్జ్ డాటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం, కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా సుమారు మరో 350 మెగావాట్ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నట్టు, అందులోభాగంగానే ఈ కొత్త పెట్టుబడులని ఓ ప్రకటనలో కంట్రోల్ఎస్ స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్లోని డాటా సెంటర్ల విస్తరణ, ఇక్కడ కొత్తగా నియామకాలకు ఆస్కారముంటున్నది.
వెయ్యి ఉద్యోగాలు
రాబోయే ఆరేండ్లలో తాము పెట్టబోయే పెట్టుబడులకుతోడు వెయ్యికిపైగా ఉద్యోగులను తీసుకోనున్నట్టు కంట్రోల్ఎస్ చెప్పింది. ‘మూడు దేశాల్లోని 153 మెగావాట్ పీక్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టనున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 2.5 లక్షల మెగావాట్ అవర్స్ విద్యుదుత్పత్తి అవుతుంది. ఇందులో మహారాష్ట్రలోని మా సంస్థకు చెందిన 145 మెగావాట్ పీక్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉన్నది. 2025కల్లా మరో 300 మెగావాట్ పీక్ సామర్థ్యముండే ప్రాజెక్టులను నెలకొల్పనున్నాం’ అని కంట్రోల్ఎస్ తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా పునరుత్పాదక శక్తిని మించి బహుళార్ధ వ్యూహాలతో నెట్ జీరో లక్ష్యాలను సాధించాలని కంట్రోల్ఎస్ చూస్తున్నది. మరింత పొదుపుగా నీటిని వినియోగించాలని చూస్తున్న కంపెనీ.. తమ అన్ని డాటా సెంటర్ల వద్ద 100 శాతం రీసైకిల్డ్ వాటర్ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అత్యాధునిక రీసైక్లింగ్ టెక్నాలజీలను వాడుకోనున్నట్టు సదరు ప్రకటనలో కంట్రోల్ఎస్ వివరించింది.
80,000 కోట్లు
వచ్చే మూడేండ్లలో డాటా సెంటర్లు రూ. 80,000 కోట్ల పెట్టుబడుల్ని (10 బిలియన్ డాలర్లు) ఆకట్టుకొనే అవకాశాలున్నాయని దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ, ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్ ఇండియాల నివేదిక ఒకటి అంచనా వేసింది. ఇంటర్నెట్ యాక్సెస్లో వేగంగా పెరిగిన వృద్ధితోపాటు పెరుగుతున్న క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగం, ఐవోటీ, 5జీ, ప్రభుత్వ డిజిటలైజేషన్ కార్యక్రమాలతో స్టోరేజీ సామర్థ్యానికి డిమాండ్ ఊపందుకున్నట్టు ‘ఇండియా డాటా సెంటర్స్: ఎంటరింగ్ క్వాం టమ్ గ్రోత్ ఫేజ్’ పేరుతో తాజాగా విడుదల చేసిన రిపోర్టులో సీఐఐ-కొల్లీర్స్ వివరించాయి.
అలాగే ఈ రంగంలో 2020 నుంచి భారత్లోకి దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశాయి. గ్లోబల్ డాటా సెంటర్ ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ఇదిలావుంటే హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెల్లో డాటా సెంటర్ సామర్థ్యం ఈ ఏడాది ఆగస్టు నాటికి 819 మెగావాట్లుగా ఉన్నదని, 1.1 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టాక్ వ్యాపించిందని ఈ రిపోర్టు తెలిపింది. దీంతో 2026కల్లా 2.3 కోట్ల చ.అ. పెరుగవచ్చని కొల్లీర్స్ ఇండియా అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే డాటా సెంటర్ మొత్తం సామర్థ్యం సుమారు 1800 మెగావాట్లకు చేరవచ్చన్నది.