పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి సూచించారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ టీకాల విషయంలో అపోహలకు తావివ్వవద్దని వివరించారు.
మంథని టౌన్, ఏప్రిల్ 26: ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో డాక్టర్ శంకరాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో 335 మందికి టీకా వేసినట్లు ఆమె తెలిపారు. అలాగే మంథని ప్రభుత్వ దవాఖానలో 192 మందికి వ్యాక్సిన్ వేయగా, గద్దలపల్లి పీహెచ్సీలో 63 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ నరేశ్ ఆగంతం తెలిపారు. సోమవారం మూడు సెంటర్లలో 590 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు వైద్యులు వెల్లడించారు.
ధర్మారం, ఏప్రిల్26: మండలంలో సోమవారం 423మందికి వైద్య సిబ్బంది టీకాలు వేశారు. కమ్మర్ఖాన్పేటలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించి 259 మందికి టీకాలు వేశారు. ఈ గ్రామానికి లంబాడి తండా (కె), కల్లెంరెడ్డిపల్లికి చెందిన 45 ఏండ్ల పై బడిన వారు టీకాలు వేయించుకున్నారు. శిబిరాన్ని కరోనా నియంత్రణ టాస్క్ఫోర్స్ కమిటీ మండల కన్వీనర్, ఎంపీడీవో జయశీల, నంది మేడారం పీహెచ్సీ డాక్టర్ సంపత్ రెడ్డి పర్యవేక్షించారు. శిబిరంలో సర్పంచ్ గుజ్జుల రమ, ఎంపీటీసీ కాదాసి శంకరమ్మ, ఉప సర్పంచ్ కుందేళ్ల కిరణ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నంది మేడారం పీహెచ్సీలో 164 మందికి వ్యాక్సిన్ వేశారు. 68 మందికి ర్యాపిడ్ టెస్ట్లు చేయగా, 8మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వెల్లడించారు.
జ్యోతినగర్, ఏప్రిల్ 26: విలేజ్ రామగుండం పట్టణ పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో టీకాలకు స్పందన వచ్చింది. ఎన్టీపీసీ దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలోని వ్యాక్సినేషన్ సెంటర్లో 156మంది టీకాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులోన సురక్షయ కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్లో 80మంది కాంట్రాక్ట్ కార్మికులు వ్యాక్సిన్ వేసుకున్నారు. అలాగే టౌన్షిప్లోని ధన్వంతరి దవాఖానలో 128మంది ఉద్యోగులకు దవాఖాన సిబ్బంది టీకాలు వేయగా, రామగుండంలోని 21వ డివిజన్ విద్యుత్నగర్లో 89మంది వ్యాక్సిన్ టీకాలు తీసుకున్నారు. ఇక్కడ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ మాణికేశ్వర్రెడ్డి, సూపర్వైజర్లు సమ్మయ్య, తిరుపతిరెడ్డి, కార్పొరేటర్ అమ్రీన్ ఫాతిమా సలీం బేగ్, ఎన్టీపీసీ వైద్య సిబ్బంది ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, ఏప్రిల్ 26: రామగుండం 14, 39 డివిజన్లలో వ్యాక్సిన్లు వేశారు. గౌతమినగర్లోని సొసైటీ కార్యాలయంలో లక్ష్మీపురం ఆరోగ్య సిబ్బంది 93 మందికి వ్యా క్సిన్ వేశారు. కార్యక్రమాల్లో సొసైటీ అధ్యక్షుడు గోపాల్ రావు, హరిసింగ్, లక్ష్మీనారాయణ, లింగమూర్తి, విజయ్కుమార్, నర్సయ్య, కార్పొరేటర్ నీలి పద్మ గణేశ్ ఉన్నారు.
రామగిరి, ఏప్రిల్ 26 : బేగంపేట పీహెచ్సీ డాక్టర్ నాగశిరోమణి ఆధ్వర్యంలో కల్వచర్లలో 312 మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటి టీకాను సర్పంచ్ గంట పద్మకు వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయకుమార్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సందీప్, ఉప సర్పంచ్ బండ ప్రసాద్, ఏఎన్ఎం సాధన, తార, ఆశ వర్కర్లు విజయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి, ఏప్రిల్26: బసంత్నగర్, పుట్నూర్ పీహెచ్సీ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి, టీకాలు వేస్తున్నారు. బసంత్నగర్లో 145, కన్నాలలో 110 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ స్నేహ తెలిపారు. భామ్లానాయక్తండాలో సర్పంచ్ రాజునాయక్ శానిటైజేషన్ చేయించారు. కార్యక్రమాల్లో సర్పంచులు కట్టెకోల వేణుగోపాల్రావు, మల్క చంద్రకళ, డాక్టర్ స్నేహ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.