వడ్ల నిల్వకు ‘వేదిక’లు
ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలుసైతం వినియోగం
రైతులకు భరోసా కల్పిస్తున్న అధికారులు
తొర్రూరు, జూన్ 7 : ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదికలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను గోదాములుగా మారుస్తున్నారు. అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటకు రక్షణగా వాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు రైతు వేదికలు, స్కూళ్లు, ఇతర కార్యాలయాలు వడ్ల బస్తాలతో నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా సాగునీరు రావడంతో మానుకోట జిల్లాలో యాసంగిలో ధాన్యం పుట్లకొద్దీ పండింది. 162 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.330 కోట్ల విలువైన లక్షా 75వేల069 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఎక్కడచూసినా ధాన్యపు రాశులతో కళకళలాడుతుండగా ఇప్పటివరకు లక్షా 54వేల 217 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వివిధ రైస్ మిల్లులకు తరలించారు. ఇటీవల రెండు సార్లు వర్షాల కారణంగా కేంద్రాల్లో కొంత ధాన్యం తడిసింది.
తడిసిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని ప్రభు త్వం రైతుల్లో భరోసా నింపింది. ఇదే సమయంలో వర్షాలు మొదలవడంతో ధాన్యం తరలింపు ప్రక్రియను అధికారులు వేగవం తం చేశారు. కరోనా కారణంగా లారీలు, హమాలీల కొరత తలెత్తడంతో గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లు, డీసీఎంలను అధికారులు వినియోగించుకుంటూ స్థానికంగా ఉన్న రైతువేదికలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ భవనాలు, ప్రారంభం కాని ప్రభుత్వ కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇం డ్లలో నిల్వ చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఆదివారం నాటికి 79,447 బస్తాలను ఈ కేంద్రాల్లో నిల్వ చేశారు. సోమవారం సుమారు 15వేల ధాన్యం బస్తాలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు.