న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్తో వణికిస్తుంటే జాబ్ మార్కెట్లో గడ్డుకాలం నడుస్తోంది. ఈ సంక్లిష్ట సమయంలో టెక్నాలజీ రంగంలో జాబ్లు సొంతం చేసుకోవాలంటే తగిన నైపుణ్యాలను కలిగిఉండాలి. ఇంటర్వ్యూల్లో రిక్రూటర్స్ అభ్యర్ధుల్లో ఎలాంటి నైపుణ్యాలను ఆశిస్తారనే దానిపై గూగుల్ (Google) మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లారీ హ్యుస్ జాన్సన్ కీలక వివరాలు వెల్లడించారు. అభ్యర్ధులు స్వీయ అవగాహనను పెంపొందించుకోవాలని ఇదే ఉద్యోగార్ధుల్లో కీలక లక్షణమని పేర్కొన్నారు.
స్వీయ అవగాహన అనేది అరుదుగా కనిపించే లక్షణమని ఆమె చెప్పుకొచ్చారు. గూగుల్లో పదేండ్ల తన వైస్ ప్రెసిడెంట్ ప్రస్ధానంలో తాను 40 గంటల పాటు జాబ్ ఇంటర్వ్యూలు చేస్తూ గడిపానని చెబుతూ ఈ క్రమంలో తాను ఉద్యోగార్ధుల్లో స్వీయ అవగాహనను ప్రధానంగా పరిశీలించానని అన్నారు. అనుభవంతో పాటు ఇతర స్కిల్స్ కూడా కీలకమే అయినా వాటిని మెల్లిగా అందిపుచ్చుకోవని, స్వీయ అవగాహన ఉన్నవారు స్ఫూర్తిదాయకంగా ఉంటూ వారు పనిచేసేందుకు ఏం అవసరమో తెలసుకోగలుగుతారని చెప్పారు.
స్వీయ అవగాహన మెరుగ్గా ఉన్నవారు తమ సహచరులు, మేనేజర్లతో సులభంగా కలిసిపోతారని పేర్కొన్నారు. స్వీయ అవగాహన అనేది అరుదైన లక్షణం కాగా, 95 శాతం మంది తాము స్వీయ అవగాహనతో ఉన్నామని భావించినా పది నుంచి పదిహేను శాతం మందే ఈ అరుదైన క్వాలిటీ కలిగిఉంటారని పరిశోధనలు వెల్లడించాయి. ఇంటర్వ్యూ సందర్భంగా ఎక్కువగా నేను అనే పదం కంటే మేము అనే పదం వాడిన వారు స్వీయ అవగాహన కలిగిన వారుగా గుర్తిస్తానని క్లారీ చెప్పుకొచ్చారు. అయితే ఎక్కువగా మేము అనే పదం వాడినా వారు ఇతరులపై ఆధారపడే వారనే సంకేతాలు వెల్లడవుతాయని ఈ రెండు పదాల మధ్య సమతూకం పాటిస్తూ ఇంటర్వ్యూను ఎదుర్కొనే వారి కోసం తాను చూస్తానని తెలిపారు.
Read More :