Oneweb | ఇంటర్నెట్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. సాధారణ 2జీ స్పీడ్ నుంచి 4జీ.. ఇప్పుడు 5జీ దిశగా అడుగులు వేస్తున్నాం. అయినా సరే ఏదో ఇప్పటికీ ఇంటర్నెట్ సమస్య ఎదుర్కొంటూనే ఉన్నాం. రవాణా సౌకర్యాలు లేని, కొండ ప్రాంతాలను పక్కన పెడితే.. ప్రధాన నగరాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి ఆన్లైన్ సమస్యలు లేకుండా ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సరే హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే ఉద్దేశ్యంతో ఎయిర్టెల్ ( Airtel ) కంపెనీ మాతృ సంస్థ అయిన భారతీ గ్రూప్ ( Bharti Group ) ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భూకంపాలు, తుఫాన్లు వంటి ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సరే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు. ఆ ప్రాజెక్ట్ వన్వెబ్. అసలేంటి ఈ వన్వెబ్ ప్రాజెక్ట్. అంతరిక్షం నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ ( Internet from Space ) సాధ్యమేనా? ఒకసారి చూద్దాం..
ఇప్పటివరకు ఇంటర్నెట్ కావాలంటే టవర్లు నిర్మించడమో.. కేబుల్ కనెక్షన్లు ఇవ్వడమో చేసేవారు. అదే ఈ వన్వెబ్తో అంతరిక్షం నుంచే ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఈ విధానంలో వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ దిగువ కక్ష్య ( లో ఎర్త్ ఆర్బిట్ )లో ప్రవేశపెడతారు. అవి అక్కడి నుంచి భూమిపై ఎక్కడైనా, ఎవ్వరికైనా ఇంటర్నెట్ను అందిస్తాయి. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువు ఉన్న 648 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇప్పటికే 218 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోనున్నాయి. ఇక రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాకి చెందిన ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సహాయంతో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
భూ దిగువ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ను రిసీవ్ చేసుకునేందుకు వినియోగదారుల వద్ద ఒక యాంటీనాను అమరుస్తారు. ఇంటర్నెట్ వినియోగం, స్పీడ్కు అనుగుణంగా వేర్వేరు సైజుల్లో ఈ యాంటీనాలు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నౌకలు, విమానాలు, దీవులు, పర్వాతాలు, దట్టమైన అడవుల్లోనూ నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. నిజానికి కమ్యూనికేషన్ల కోసం వాడే జియో స్టేషనరీ ఉపగ్రహాలు భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అందువల్ల ఈ ఉపగ్రహాలు పంపే సంకేతాలు కొంచెం ఆలస్యంగా భూమిని చేరతాయి. కానీ వన్వెబ్ ఉపగ్రహాలకు కేవలం 1200 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటాయి. దీనివల్ల జియో స్టేషనరీ ఉపగ్రహాల కంటే వేగంగా సంకేతాలు భూమికి చేరుతాయి.
ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్వెబ్ను జార్జి వేలర్ 2012లో స్థాపించాడు. కానీ 2020 మార్చిలో ఈ కంపెనీ దివాళా తీసింది. అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం అప్పట్లో వన్వెబ్ కంపెనీకి ఇన్వెస్టర్లను తెచ్చే ప్రయత్నాలు చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న వన్వెబ్ను గతేడాది బ్రిటన్ ప్రభుత్వం, భారతీ గ్రూప్ కలిసి గట్టెక్కించాయి. ఈ క్రమంలోనే తాజాగా వన్వెబ్లో మరో రూ.3700 కోట్ల పెట్టుబడులను భారతీ గ్రూప్ పెట్టింది. తాజా పెట్టుబడులతో వన్వెబ్లో 38.6 శాతం వాటాతో భారతీ అతిపెద్ద వాటాదారు అవుతుంది. బ్రిటన్ ప్రభుత్వం, ఈయూటెలిశాట్, సాఫ్ట్ బ్యాంకులకు ఒక్కోదానికి 19.3 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రెగ్యులేటరీ కంపెనీల నుంచి అనుమతులు వస్తే 2021 ద్వితీయార్ధానికి ఈ డీల్ పూర్తయి.. 2022లో ఈ కంపెనీ భారత్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
స్పేస్ఎక్స్కు చెందిన స్టార్లింక్తో వన్వెబ్కు పోటీ ఉంది. స్టార్లింక్ దాదాపు 1385 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇవి కూడా లోఎర్త్ ఆర్బిట్లోనే ఉన్నాయి. స్టార్లింక్ ఇప్పటికే 500 డాలర్లకు యాంటీనా, ప్రతి నెలా 99 డాలర్ల సబ్స్క్రిప్షన్ ఫీజు నిర్ణయించింది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా క్యూపర్ పేరుతో ఇటువంటి ప్రాజెక్ట్నే చేపట్టింది.ఈ ప్రాజెక్టులో భాగంగా 3236 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు దాదాపు 10 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆన్లైన్ క్లాసుల కోసం లాప్టాప్ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఐఫోన్ అంటే యమక్రేజీ.. ఆపిల్కు ప్రాఫిట్స్ పంట.. మిగతావీ అంతే..
సైలెంట్గా.. సౌండ్ కన్నా వేగంగా దూసుకెళ్లే విమానం.. ఇదెలా సాధ్యం?