కరోనా కారణంగా ఇప్పుడు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువంతా దాదాపు ఆన్లైన్లోనే సాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ( Online Classes ) వినేందుకు పిల్లలకు మొబైల్ లేదా లాప్టాప్ ( Laptop ) తప్పనిసరి అయింది. మొబైల్లో క్లాసులు వినడానికి సౌకర్యంగానే ఉన్నా.. ప్రాజెక్టులు, అసైన్మెంట్లు చేయడానికి కంప్యూటర్/ లాప్టాప్ అయితేనే బెటర్ అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. నిజానికి మొబైల్ కంటే కూడా కంప్యూటర్/ లాప్టాప్ ఉండటమే మంచిది. అయితే ఏది పడితే అది తీసుకోకుండా లాప్టాప్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం బెటర్.
మార్కెట్లో అన్ని ఫీచర్లతో లేటెస్ట్ లాప్టాప్ కావాలంటే 50వేల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ విద్యార్థుల చదువులకు వినియోగించే లాప్టాప్ కోసం అంత సొమ్ము పెట్టాల్సిన పని లేదు. హెచ్పీ, డెల్, ఏసర్, అసూస్ వంటి బ్రాండ్ కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే లాప్టాప్లు అందిస్తున్నాయి. వీటిలో రూ.30 వేల నుంచి రూ.50 వేల బడ్జెట్లో మనకు కావాల్సిన లాప్టాప్ ఎంచుకోవచ్చు.
స్క్రీన్ రెజల్యూషన్ పెరిగినా కొద్దీ లాప్టాప్ ధర కూడా పెరుగుతుంది. ఆన్లైన్ క్లాసులకు ఉపయోగించే లాప్టాప్ కోసం హై రిజల్యూషన్ స్క్రీన్ అవసరం లేదు. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ( 1920 x 1080 pixels ) ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఖర్చు తగ్గించుకోవాలని అనుకుంటే 1366 x 768 pixels డిస్ ప్లే స్క్రీన్ తీసుకున్నా బాగానే ఉంటుంది.
విద్యార్థుల అవసరాలకు ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ సరిపోతుంది. ఐ3 తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసర్లు చాలానే వచ్చాయి. కానీ ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లకు అంత అడ్వాన్స్డ్ ప్రాసెసర్లు అవసరం లేదు. ఒకవేళ తీసుకుందామని అనుకున్నా.. డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మరీ అంత పాత ప్రాసెసర్ వద్దు అనిపిస్తే ఐ5 ప్రాసెసర్ తీసుకుంటే చాలు.
ఆన్లైన్ క్లాసుల కోసం ఎక్కువసేపు లాప్టాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. జూమ్ వంటి వీడియోకాల్స్ యాప్ ఎక్కువసేపు రన్ చేయాల్సి ఉంటుంది. అదికాకుండా అసైన్మెంట్లు చేసేటప్పుడు లాప్టాప్ వేగంగా పనిచేయాలి. కాబట్టి 8 జీబీ ర్యామ్ తప్పనిసరిగా ఉండాలి. 4 జీబీ ర్యామ్ తీసుకుంటే.. యాప్స్ వాడినప్పుడు, అసైన్మెంట్లు చేసినప్పుడు స్పీడ్ తగ్గి సతాయిస్తుంది.
కేవలం ఆన్లైన్ క్లాసులు వినేందుకు మాత్రమే అయితే 512GB HDD లేదా 256GB SSD స్టోరేజి సరిపోతుంది. ఆన్లైన్ క్లాసులు, ఇతరత్రా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటే ఈ స్టోరేజి సరిపోదు. కాబట్టి అప్పుడు ఎక్కువ స్టోరేజి తీసుకోవాలి.
ఇటీవల కాలంలో సైబర్ దాడులు ఎక్కువైపోయాయి. మాల్వేర్ నుంచి లాప్టాప్ భద్రంగా ఉండాలంటే జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. కాబట్టి కంపెనీ ల్యాప్టాప్తో వచ్చే ఓఎస్ తీసుకోవడం మంచిది. లేదంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఒరిజినల్ ఓఎస్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. జెన్యూన్ ఓఎస్లో విండోస్ డిఫెండర్ యాంటీ వైరస్ డిఫాల్ట్గా వస్తుంది. ఇది మాల్వేర్లను అడ్డుకుంటుంది. ఓఎస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
స్టోరేజి సమస్య వల్ల లేదా తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడతాయని అనుకున్నప్పుడు ఆన్లైన్ క్లాసులు, ఇతర ప్రాజెక్టులను డీవీడీల్లోకి కాపీ చేసుకుంటూ ఉంటాం. డీవీడీ రైటర్ ఉంటే ఎప్పటికప్పుడు ఫైల్స్ను డీవీడీల్లోకి కాపీ చేసుకోవచ్చు.
చదువుల కోసం పిల్లలకు లాప్టాప్ కొని దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తే సరిపోదు. మీ పిల్లలు ఇంటర్నెట్ మాయాజాలంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం లాప్టాప్లో పేరెంట్ కంట్రోల్స్ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆన్లైన్ క్లాసులకు అవసరమైన టూల్స్ను మాత్రమే అనుమతించాలి. ప్రమాదకరమైన, అసభ్యకర వెబ్సైట్ల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఆ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ పాస్కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి