సంగారెడ్డి, మే 21 : ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ టెలీకాన్పరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, అన్లోడ్, రవాణా, హమాలీలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సంబంధిత అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ధాన్యం అన్లోడ్ చేయడంలో జాప్యం జరిగితే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అవసరమైతే అదనంగా హమాలీలను పెంచుకుని త్వరగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నదన్నారు. రైస్ మిల్లర్లు జిల్లా అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 96 వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేయడానికి వీలుందని, ఇంకా కావాల్సిన స్టోరేజీ ఏర్పాట్ల కోసం దృష్టి సారించాలని అదనపు వీరారెడ్డికి సూచించారు. ధాన్యం స్టోరేజీ కోసం రైస్ మిల్లు పరిధిలో దగ్గరలో ఫంక్షన్ హాళ్లు, ఖాళీ ఇండ్లను చూసి ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని, మిల్లర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను వెంటనే తిరిగి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఫౌరసరఫరాల మేనేజర్ సుగుణ బాయిను ఆదేశించారు. వర్షానికి ధాన్య తడువకుండా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్లు ఇవ్వాలని జిల్లా మార్కెటింగ్ అధికారికి సూచించారు.
ట్యాబ్ ఎంట్రీ చేసి డబ్బులు జమ చేయాలి
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో అన్లోడ్ చేసిన వెంటనే ట్యాబ్లో నమోదు చేసి రైతులకు సకాలంలో డబ్బు అందేలా చూడాల్సిన బాధ్యత సిట్టింగ్ అధికారులదేనని కలెక్టర్ తెలిపారు. రవాణాకు టాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలను పెంచాలని, రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. కాంట్రాక్టును రద్దు చేస్తామని, రెండు రోజుల్లో వాహనాలు పెంచాలన్నారు. రోజు వాహనాలు కొనుగోలు కేంద్రాలకు రాకపోవడంపై కాంట్రాక్టర్లపై అగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డికి సూచించారు. టెలీకాన్పరెన్స్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివలింగయ్య, డీసీవో ప్రసాద్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ బాయి, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ జిల్లా అధికారి నర్సింగరావు, రెవెన్యూ డివిజన్ అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.