జహీరాబాద్, మే 4 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎరువులు, విత్తనాల వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకూడదని డీఎస్పీ శంకర్రాజు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ డివిజన్ ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో హుగ్గెల్లి రైతు వేదిక భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు దిగుబడులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు లేని జహీరాబాద్ డివిజన్గా చేసేందుకు వ్యాపారులు సహకరించాలన్నారు. ప్రతి వ్యాపారి రోజు వారి ఎరువులు, విత్తనాల నిల్వలు నోటీసు బోర్డు పై నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మకాలు చేసే వ్యాపారుల పై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏడీఏ భిక్షపతి మాట్లాడుతూ ప్రతి వ్యాపారి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ పాసు విధానంతో ఎరువులు అమ్మకాలు చేస్తే నిల్వ సమాచారం రాష్ట్ర అధికారులకు తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు రాజశేఖర్, నాగేశ్వర్రావు, జహీరాబాద్ రూరల్, ఝరాసంగం ఎస్ఐలు రవి, గోపి, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండల వ్యవసాయ శాఖ అధికారులు ప్రవీణ, వినోద్కుమార్, నవీన్కుమార్, వెంకటేశం, లావణ్య, ఏఈవోలు, విత్తనాలు, ఎరువుల వ్యాపారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే
అనుమతులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించిన వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తామని టాస్క్ఫోర్స్ ఏడీఏ శ్రీనివాస్ ప్రసాద్, సీడ్ సర్టిఫికేషన్ అధికారి నగేశ్ హెచ్చరించారు. శుక్రవారం జోగిపేటలోని జగదీశ్వరీ, ఏ. శంకరయ్య, శ్రీనివాస, చింతల రాజమల్లయ్య ఫర్టిలైజర్, రైతుమిత్ర ట్రేడర్స్ దుకాణాల్లో స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఎస్ఐ రవికాంత్, ఏవో సారిక, ఏఈవోలు పాల్గొన్నారు.
దుకాణాలను తనిఖీ
ఝరాసంగం, జూన్ 4 : మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం డీఎస్పీ శంకర్రాజ్ ఏడీఏ భిక్షపతితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ లైసెన్సు లేకుండా దుకాణాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు ధరల పట్టికను బోర్డుపై రాసి ఉంచాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం, సీఐ నాగేశ్వర్, ఎస్ఐ గోపి, గ్రామ సర్పంచ్ బస్వరాజుపాటిల్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్యస్వామి, ఏఈవోలు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణంలో కొనుగోళ్లను నిలిపిన టాస్క్ఫోర్స్
పుల్కల్, జూన్ 4 : పుల్కల్లో శుక్రవారం వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. సాయిరాం ఫర్టిలైజర్ దుకాణంలో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో విత్తనాలు విక్రయించవద్దని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి చైతన్య, టాస్క్ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రసాద్, రవికాంత్ పాల్గొన్నారు.
వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తాం
వట్పల్లి : నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తామని మండల వ్యవసాయ అధికారి మహేశ్చౌహన్ హెచ్చరించారు. మండలంలోని మర్వెల్లిలో ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు మాత్రమే విక్రయించాలన్నారు. విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు.