జహీరాబాద్, మే 4 : రైతులు పండించిన పంటలు నిల్వ చేసేందుకు గోదాములు, ఉద్యాన పంటలు నిల్వ చేసేందుకు శీతల గోదాము ఏర్పాటు చేసేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. నాబార్డు ఆర్థిక సహాయంతో ‘జహీరాబాద్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని వేయ్యి మందితో ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కోప్ స్వచ్ఛంద సంస్ధ రైతులకు సేంద్రియ పంటల సాగు, మార్కెటింగ్ విధానం, వర్షపు నీరు నిల్వతో జీవనోపాధిపై అవగాహన కల్పిస్తూ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. శేకాంపూర్ గ్రామంలో కార్యాలయం ఏర్పాటు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు నాబార్డు స్కోప్ సంస్థలు అభివృద్ధి పనులు చేపట్టాయి. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి రైతు తమ వాటాగా రూ.1000 చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. మొగుడంపల్లి మండలంలో అధికంగా గిరిజనులు ఉండడంతో కొత్తగా నాబార్డు, గిరిజన సంక్షేమ శాఖ రూ.60 లక్షలు మంజూరు చేసింది. ‘జహీరాబాద్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ద్వారా రూ.34.40 లక్షలు గిరిజన సంక్షేమ శాఖ, 13 లక్షలు రైతు ఉత్పత్తిదారుల వాటా, 12 లక్షలు నాబార్డు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మొగుడంపల్లిలో భూమి కేటాయించగానే పనులు చేసేందుకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ సిద్ధంగా ఉంది.
రైతులకు ఉపయోగపడే పనులు..
ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేయడంతో అధికంగా గిరిజన రైతులు ఉన్న మొగుడంపల్లిలో పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు రూ.22.5 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మిస్తారు. రూ.6.10 లక్షలతో మిని పప్పు మిల్లు నిర్మాణం, రూ.12 లక్షలతో వ్యవసాయ పని ముట్లు కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేశారు. ఆలుగడ్డ ఇతర ఉద్యాన పంటలు నిల్వ చేసేందుకు శీతల గోదాము నిర్మాణం చేసేందుకు రూ. 14.60 లక్షలు మంజూరు చేసింది. ఇతర ఖర్చుల కోసం రూ. 4.80 లక్షలు మంజూరు చేసింది.
ప్రభుత్వం భూమి కేటాయించగానే పనులు చేసేందుకు ప్రణాళిక..
మొగుడంపల్లిలో ప్రభుత్వం భూమి కేటాయించగానే పనులు చేసేందుకు ‘జహీరాబాద్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. రైతులకు ప్రభుత్వానికి సమన్వయం చేసేందుకు స్కోర్ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుంది. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు అధికంగా ఆలుగడ్డను సాగు చేస్తారు. పంటను నిల్వ చేసుకోనేందుకు, విత్తనం నిల్వ చేసేందుకు శీతల గోదాము లేదు. ప్రతి ఏడాది రైతులు ఆలుగడ్డ విత్తనం కోసం ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్తోపాటు పలు రాష్ర్టాలకు వెళ్లి జహీరాబాద్ ప్రాంత రైతులు కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు జహీరాబాద్లో శీతల గోదాము నిర్మాణం చేస్తే మేలు జరుగుతుందని నాబార్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు నాబార్డు, గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేసింది. రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాము నిర్మాణం, కంది, శనగలు, పెసరా, మినుము పంటలను పప్పు చేసి మార్కెట్లో అమ్మకాలు చేసేందుకు మినీ దాల్ మిల్లు ఏర్పాటు చేస్తున్నారు.