జహీరాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈరన్నవాగు చెరువులో చేపపిల్లలను వదిలి , అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై జిల్లాలో 1350 చెరువుల్లో 4.83 కోట్లు చేప పిల్లలు వదులుతున్నదన్నారు. చెరువుల్లోని చేపలను పట్టి సంతలు, మార్కెట్లలో విక్రయించేందుకు మత్స్యకారులకు ప్రభుత్వం మోపెడ్లను పంపిణీ చేసిందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
99 చెరువుల్లో 37.97 లక్షల చేప పిల్లలు పెంపకం :మాణిక్రావు
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 99 చెరువుల్లో 37.97 లక్షల చేప పిల్లలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. ప్రతి మత్స్యకారుడికి సహకార సంఘంలో సభ్యత్వం ఇచ్చి, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో మత్స్యకారుల సహకార సంఘాలకు సామూహిక భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో నీటివనరులు ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఏడి సతీశ్, సహాయ అధికారి శ్రీశైలం, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎంజీ. రాములు, టీఆర్ఎస్ నాయకులు జి. గుండప్ప, సుభాశ్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, ఎంపీడీవో రాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.