రామచంద్రాపురం, ఏప్రిల్10: చట్టప్రకారమే అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని ఉస్మాన్నగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఉమేశ్వర్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ చిట్టి భర్త ఉమేశ్వర్ ప్రోద్బల్యంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. అధికారులు కూల్చివేసిన నిర్మాణాల్లో టీఆర్ఎస్కు చెందిన వారివి కూడా ఉన్నాయన్నారు. గతంలో గ్రామపంచాయతీ ఉన్న సమయంలో సర్పంచ్ను పక్కనబెట్టి ఉపసర్పంచ్ శ్యాంరావు తన లెటర్లో డబ్బా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉస్మాన్నగర్లో గత పాలకుల మాదిరిగా తప్పిదాలు చేయకుండా ప్రజలకు ఆదర్శపాలన అందించేందుకు కౌన్సిలర్ కృషి చేస్తున్నదన్నారు. తమకు వస్తున్న మంచిపేరుని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రేమ్, అంజయ్య, రాజు, వెంకటేశ్, లక్ష్మీనారాయణ, శేఖర్రెడ్డి, నారాయణరెడ్డి, రామ్మోహన్, మురళి, మల్లేశ్ ఉన్నారు.