జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి
రంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిరంతరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సరిపోను మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వర్షాల దృష్ట్యా వాగులు, కుంటల వద్ద ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించాలని, వ్యాపారాల్లో ఎస్హెచ్జీ సభ్యులు రాణించేలా ప్రత్యేక శిక్షణనివ్వాలన్నారు. జిల్లాలోని ఆసరా పింఛన్ల కింద నెలకు రూ.36 కోట్లను ఖర్చు చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జడ్పీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.