శంకర్పల్లి, జనవరి 10: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్రంలో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతున్నది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆడుకోవడానికి సరైన ఆట స్థలం లేక ఆటలపై దృష్టి సారించేవారు కాదు, కానీ ప్రభుత్వం ప్రారంభించిన క్రీడ ప్రాంగణాల వల్ల ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. చాలా మంది మారుమూల ప్రాంతాల యువత క్రీడల్లో ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ప్రారంభించింది. క్రీడా ప్రాంగణాల వల్ల మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా శంకర్పల్లి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో, 20 క్రీడా ప్రాంగణాలను పూర్తి చేశారు. ఇంకా 6 క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని అన్వేషించి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఆటలపై ఆసక్తి ఉన్నా సరైన ఆట స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలతో ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని వెలికి తీయడానికి క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం.
– గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ
క్రీడా ప్రాంగణాలతో యువతలోని నైపుణ్యాన్ని బయటికి తీయవచ్చు. గ్రామీణ యువత కోసం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం గొప్పవిషయం. మండలంలో 26 గ్రామాలకు గాను 20 క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చాం. మిగతా 6 గ్రామాల్లో స్థలాన్ని సేకరించి వాటిని పూర్తిచేస్తాం. గ్రామీణ యువత క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలి. – వెంకయ్య, ఎంపీడీవో