పరిగి టౌన్, మే 19 : ఓ దొంగబాబా నిర్వాకానికి విద్యార్థిని ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన వివరాలను గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన నాగసారం వెంకటేశం కూతురు అశ్విని(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది.
కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పరిగి మండలం నస్కల్ గ్రామ సమీపంలో ఉండే భూత వైద్యుడు రఫీక్ను ఆశ్రయించారు. అమ్మాయికి గాలి సోకిందని తాను బాగు చేస్తానని నమ్మబలికి అతడు అశ్వినిని నిప్పుల కుంపటిలో నడిపించాడు. దీంతో ఆమె రెండు కాళ్లు పూర్తిగా కాలి బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు వికారాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు రఫీక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.