బొంరాస్పేట, జనవరి 17 : జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసారి 72,618 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో రైతులు గతసారి కంటే కొంత విస్తీర్ణాన్ని తగ్గించుకొని వరిసాగు చేస్తున్నారు.
దోమ మండలంలో అత్యధికంగా 12,780 ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశం ఉండగా.. ఆ తరువాత బొంరాస్పేట మండలంలో 12 వేల ఎకరాల్లో సాగవుతున్నది. వరి పంటకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం సులభతరం చేసింది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఏటా వరి సాగుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో లఖ్నాపూర్, జుంటుపల్లి ప్రాజెక్టుల కింద కొంత మేర వరి పంటను సాగు చేస్తారు. వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతుండడంతో మహిళా కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఎకరా పొలంలో నాటు వేసేందుకు రూ.5 వేల వరకు కూలీ తీసుకుంటున్నారు. మహిళా కూలీలతో పాటు ట్రాక్టర్ల యజమానులకు కూడా కరిగెట పనులు దొరుకుతున్నాయి.
యాసంగి వ్యవసాయ పనులకు అవసరమయ్యే ఎరువులు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. యాసంగి సీజన్లో జిల్లాకు 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. మిగతా ఎరువులు ఎప్పటికప్పుడూ వస్తూనే ఉంటాయని, ఎరువులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు.