యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణదార్లు, యాజ్ఞికబృందం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు గావించారు.
రెండో రోజు నిర్వహించిన ప్రధాన ఘట్టాలు..
మాఢవీధుల గుండా గరుడపటాన్ని తీసుకొస్తున్న అర్చకులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఆలయ పునర్నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న వేడుకలు
అత్యంత వైభవంగా నిర్వహించనున్న వైటీడీఏ
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి అలంకార సేవోత్సవాలు స్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ అలంకారాలను దర్శించినవారికి అజ్ఞానశక్తులు నశించి, జ్ఞాన శక్తులు కలిగి, శరీరం, ఆత్మ, పరమాత్మ అనే వివేక జ్ఞానం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. బ్రహోత్సవాల్లో లక్ష్మీనారసింహుడు వివిధ వాహనసేవల్లో భక్తులకు దర్శనమివ్వడం సంప్రదాయం. ఆలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే అలంకార సేవలను వెలుపలి ప్రాకార మండపంలో ముస్తాబు చేసి ఉత్తర ద్వారం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వేంచేపు మండపంలో ఆస్థానం చేసి భక్తుల సందర్శనార్థం ఉంచి అర్చకులు వేదమంత్రాలను పఠిస్తారు.
నేడు మత్స్యావతార అలంకార సేవ
ఈ సేవను గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవితో భగవంతుడు ఆదిశేషుడిపై విహరిస్తూ తీర్థ జనానికి ఆహ్లాదాన్ని అందించే అలంకారోత్సవాలు శేషవాహనంపై రాత్రి 7 గంటలకు ఊరేగిస్తారు.
వంశపారంపర్యంగా అలంకార విద్య
అలంకార విద్య నాకు వంశపారంపర్యగా వచ్చింది. తాత శృంగారం కృష్ణమాచార్యులు అలంకరణలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నాన్న రమణాచార్యులకు, ఆయన నుంచి నాకు ఈ విద్య అబ్బింది. 18వ ఏట నుంచే స్వయంగా ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో జరిగే ఉత్సవాల్లో దేవతామూర్తులకు అలంకారం చేస్తున్నాం. అవతారానికి తగ్గట్టు వస్ర్తాలు, ఆభరణాలు, ఇతర సామగ్రి నేనే తెచ్చుకుంటాను. తుదిమెరుగులు దిద్దేందుకు పుష్పాలు, దళాలు సమకూర్చాల్సి ఉంటుంది. 2023 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అలంకార సేవల్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది.
– శృంగారం ఆత్రేయాచార్యులు, విగ్రహాల అలంకరణదారుడు
భేరీపూజ, దేవతాహ్వానం..
స్వామివారి ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం నిర్వహించారు. అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారి సభాస్థానంలో స్వామివారిని పెండ్లికొడుకుగా ముస్తాబు చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు, 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. దేవతలందరికీ స్వామివారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలు అర్పించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞికులు, ఉప ప్రధానార్చకులు, సహాయ కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రాన ఆహ్లాదభరితం
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణతోపాటు అభయారణ్యాలు నిర్మించారు. రాయగిరి స్వాగత తోరణం నుంచి 5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డుగా మార్చారు. రోడ్డుకు ఇరువైపులా సుమారు 84 వేల వివిధ రకాల పూల మొక్కలతోపాటు సుగంధ ద్రవ్యాల మొక్కలు సుమారు 13 వేలు నాటారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాయగిరి చెరువును భక్తులు తనివితీరా వీక్షించేందుకు వైటీడీఏ నాలుగుచోట్ల వాటర్ ఫౌంటెయిన్లను నిర్మించింది. చెరువులో బోటింగ్ సిద్ధం చేసింది. చెరువు అలుగుపోసే ప్రాంతంలో రెండెకరాల్లో శిల్పారామం అద్భుతంగా నిర్మించారు.
రాయగిరి చెరువు దగ్గర రాయగిరి-1 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 140 ఎకరాల్లో ఆంజనేయ అరణ్యం ఏర్పాటు చేయగా, 2015 నుంచి ఇప్పటి వరకు నాటిన 44,000 మొక్కలు దట్టమైన అడవిని తలపిస్తున్నాయి. రాయగిరి-2 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 240 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నరసింహ అరణ్యంలో 2017 నుంచి 22,000 మొక్కలు నాటారు. అడవిలోనే తీర్చిదిద్దిన ఈ పార్కులు పిల్లలనే కాదు, పెద్దలనూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సెల్ఫీ పాయింట్లు, ఎంట్రీ ప్ల్లాజా, నీటితో కళకళలాడే చెక్డ్యామ్లు, వాకింగ్ ట్రాక్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. నరసింహ అరణ్యంలో జింకలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాయగిరి పట్టణంలో 16వ శతాబ్దం నాటి కోనేరు(మెట్లబావి)ను అద్భుతంగా తీర్చిదిద్దారు. చతురస్రాకారంలో పిరమిడ్లా కనిపిస్తున్న ఈ బావి పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. భువనగిరిలోని ఖిలా ట్రెక్కింగ్ ప్యారడైజ్గా వెలుగొందింది. క్రీ.శ.1123లో నిర్మించిన కోట చారిత్రక సంపదను తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు. యాదగిరిగుట్ట స్వామివారి కొండకు పశ్చిమ ప్రాంతంలో 848.13 ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మించారు. సువిశాల ఫోర్లైన్ రోడ్లు, హెలిప్యాడ్, చూడచక్కని సర్కిళ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలతో తీర్చిదిద్దారు. దాతల సహకారంతో ప్రత్యేకమైన విల్లాలు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించారు. కొండపైన అద్భుతమైన వైటీడీఏ కార్యాలయాన్ని నిర్మించారు.