యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జిల్లా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంభంతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలతోపాటు వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకున్నట్లయింది. ఇక భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెజారిటీకి ఇది మరింత దోహదపడనున్నది. కుంభం చేరికతో ఆలేరుతోపాటు, జిల్లాలోని పలు మండలాల్లో భారీ ప్రభావం చూపనుంది. చేరిక కార్యక్రమంలో విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కుంభం చేరికతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
వర్గ పోరుతో ఇబ్బందులు
కుంభం అనిల్కుమార్రెడ్డి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్నారు. సుమారు పదేండ్లుగా భువనగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, వర్గపోరు తారాస్థాయికి చేరాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గం కుంభానికి వ్యతిరేకంగా పనిచేసింది. బీసీ నినాదం పేరుతో రోజుకో మండలంలో రహస్య సమావేశాలు నిర్వహించింది. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో కుంభం తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే, ఇదంతా ప్యాకేజీల కోసమే చేస్తున్నారనే బహిరంగ ప్రచారం జరిగింది. గతంలోనూ ఇలాగే జరిగినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది.
ఆదరణతోనే బీఆర్ఎస్కు..
ప్రజల్లో బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు మంచి ఆదరణ ఉండటంతో కుంభం అనిల్కుమార్రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్ 1గా దూసుకెళ్తుండటంతో పార్టీలో చేరేందుకు ఆకర్షితులయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు నుంచి నేరుగా అనుచర గణంతో హైదరాబాద్కు చేరుకున్నారు. మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రగతిభవన్కు వెళ్లారు. అక్కడే సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జిల్లాలో కాంగ్రెస్ కుదేలు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాకు పెద్ద దిక్కులా ఉన్న కుంభం అనిల్కుమార్రెడ్డి పార్టీ మారడంతో అనాథలా మారిపోయింది. ఏకంగా జిల్లా అధ్యక్షుడే పార్టీ మారడంతో కేడర్ కూడా అయోమయంలో పడిపోయింది. దాంతో పార్టీ శ్రేణులు కూడా అనిల్కుమార్రెడ్డి వెంటే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఒక్క మునుగోడు సీటు కూడా చేజారిపోయింది. రాజగోపాల్రెడ్డి పార్టీ మారడంతో కేడర్ ఇప్పటికే నారాజ్లో ఉంది. ఇప్పుడు కుంభం కూడా వెళ్లిపోవడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకోనుంది. పార్టీ జెండా మోసేందుకు కూడా కార్యకర్తలు లేకుండా పోయే అవకాశముంది.
భువనగిరిలో గెలుపు నల్లేరు మీద నడకే..
భువనగిరి నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోనున్నారు. భువనగిరి నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆయన గెలుపు సునాయాసం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు కుంభం అనిల్కుమార్రెడ్డి చేరికతో శేఖర్రెడ్డి విజయం మరింత సులువు కానుంది. ఇద్దరి కలయికతో నియోజకర్గంలో బీఆర్ఎస్కు తిరుగులేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆలేరు నియోజకవర్గంపైనా ఎఫెక్ట్
ఇక కుంభం రాకతో ఆలేరు నియోజకవర్గంపైనా ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావడంతో అక్కడ కూడా ప్రభావితం చూపనున్నారు. ఇప్పటికే ఆలేరులో అంతర్యుద్ధం నడుస్తున్నది. నేతలంతా ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా వర్గాలుగా విడిపోయారు. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్రలోనూ బహిర్గతమయ్యాయి. ఇప్పుడు కుంభంతో పాటు ఆలేరు నియోజకవర్గం నుంచి ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్లో చేరనున్నారు. దీంతో ఆలేరులోనూ బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలు, రామన్నపేట తదితర మండలాల్లోనూ ఆయనకు అనుచురులు ఉన్నారు.