న్యూఢిల్లీ, ఆగస్టు 7: నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు మూడు రోజుల ముందే వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్లైన్ తరగతుల ద్వారా విద్యార్థులకు అవి అందాయని సీబీఐ పేర్కొంది. మొత్తం వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు చెందిన సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులు, ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. ప్రశ్నలను గుర్తు పెట్టుకోవడం, చీటీలపై రాసుకోవడం, పుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్ చేయడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించారని వెల్లడించింది.
రసాయన శాస్త్ర నిపుణుడు పీవీ కులకర్ణి గోప్యతా ప్రమాణం చేసినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ 25, 27 మధ్య పుణెలో ప్రత్యేక తరగతులు నిర్వహించారని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ తరగతులకు హాజరైన విద్యార్థులకు తదనంతరం నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు, సమాధానాలనే డిక్టేట్ చేసి చెప్పారని పేర్కొంది. లాతూర్లోని విద్యార్థులకు కూడా ఇలాంటి ప్రత్యేక తరగతులనే నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. విద్యార్థుల నోట్బుక్స్లోని ప్రశ్నలు, లీక్ అయిన ప్రశ్నపత్రంతో సరిపోలుతున్నాయని, కులకర్ణి మొబైల్ ఫోన్ నుండి కెమిస్ట్రీ ప్రశ్నల ఫొటోలు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో జరిపిన సంభాషణలు, అలాగే ఇతర కీలకమైన డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సీబీఐ పేర్కొంది. భౌతిక శాస్త్ర విషయ నిపుణురాలైన మనీషా హల్దార్ రూ. 25,000 తీసుకుని భౌతిక శాస్త్ర ప్రశ్నలను బయటకు వెల్లడించినట్టు సీబీఐ ఆరోపించింది.
పరీక్షకు 8 రోజుల ముందే ఆమె మొబైల్ ఫోన్లో చేతిరాతతో ఉన్న ప్రశ్నలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ ప్రశ్నలను ఆమె మరో నిందితుడైన తేజస్ షాకు చదివి వినిపించారు. వాటిని ఇతరులకు చేరవేసే బాధ్యత తేజస్ షాదేనని సీబీఐ పేర్కొంది. ఈ నెట్వర్క్లో విద్యార్థులకు, సబ్జెక్ట్ నిపుణులకు మధ్య మనీషా వాఘ్మరే ఒక వారధిలా వ్యవహరించారని చార్జిషీట్ పేర్కొంది. విద్యార్థులను ఆఫ్లైన్ తరగతులకు పంపేందుకు వారు తల్లిదండ్రుల నుండి రూ.4 లక్షల వరకు వసూలు చేసి ఆ నిధులను సేకరించేవారని సీబీఐ తెలిపింది.
పరీక్షలో ఆ నిర్దిష్ట ప్రశ్నలే వస్తే అదనంగా మరో రూ.50 వేలను డిమాండ్ చేశారని సీబీఐ ఆరోపించింది. ఇక మనీషా గురునాథ్ తన ఇంట్లోనే బయాలజీ తరగతులు నిర్వహించినట్టు సీబీఐ గుర్తించింది. ఆమె విద్యార్థుల చేత కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లోని నిర్దిష్ట పేరాలను గుర్తించేలా చేసి ప్రశ్నలను రాసుకోమని చెప్పారు. ఆ తర్వాత లీక్ అయిన ఫిజిక్స్ ప్రశ్నల ప్రతులను కూడా ఆమె సేకరించారని సీబీఐ పేర్కొంది.
ఈ ఏడాది నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీకేజ్కు గల కారణాలను విశ్లేషించిన సీబీఐ కొన్ని ప్రధాన లోపాలను గుర్తించింది. వీటిలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలలో పాల్గొనే విషయ నిపుణులకు అవసరానికి మించిన అనుమతి ఉండటం, అలాగే ప్రధాన కార్యాలయంలో పనివేళల్లో వారిపై నిఘా ఉంచడానికి ఎటువంటి నిఘా కెమెరా వ్యవస్థ లేకపోవడం వంటివి ఉన్నాయి. నిఘా దృశ్యాల బ్యాకప్ గరిష్ఠంగా 25 రోజులకు మాత్రమే పరిమితమై ఉండటాన్ని కూడా ఆ సంస్థ గుర్తించింది. దీనివల్ల ఒక కీలక భాగం అందుబాటులో లేకుండా పోయింది. పరీక్ష రోజున సికార్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రశ్నపత్రం లీక్ సమాచారంపై స్పందించడానికి ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఐదు రోజుల సమయం తీసుకున్నారని సీబీఐ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాసిన పరీక్షలోని అసలు ప్రశ్న పత్రాలతో సరిపోలే ప్రశ్నలను కలిగి ఉన్న ఒక గెస్ పేపర్ గురించి ఆ ఉపాధ్యాయుడికి ఆయన ఇంటి యజమాని సమాచారం అందించారు. దీనిపై ఎన్టీఏ అధిపతి మే1 మాత్రమే స్పందించారు. సీబీఐ దాఖలు చేసిన 94 పేజీల చార్జిషీట్లో ఎన్టీఏకు చెందిన సబ్జెక్ట్ నిపుణులకు ఈ ప్రక్రియలోని ఒకటి కంటే ఎక్కువ దశలకు యాక్సెస్(అనుమతి) ఉండేదని సీబీఐ పేర్కొంది. దీనివల్ల వారు ప్రశ్నల పూర్తి సెట్ను చూడగలిగేవారని, వాటిని లీక్ చేసే అవకాశం వారికి లభించిందని సీబీఐ తన చార్జిషీట్లో తెలిపింది. ఎన్టీఏ ప్యానల్లో సంబంధిత సబ్జెక్ట్ నిపుణులుగా ఉన్న పీవీ కులకర్ణి, మనీషా సంజయ్ హవల్దార్, మనీషా మందారేలతో సహా మొత్తం 13 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసి వారిపై అభియోగాలు మోపింది.