నిడమనూరు, ఆగస్టు 7 : మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏండ్లతరబడి రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతి లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథేడే కరువయ్యాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే ముడుపులు చెల్లించిన వారికి ట్రాన్స్ఫార్మర్లు బిగించడం, మంజూరైన వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర చోట్లకు తరలించడం వంటి అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సీజన్ నెత్తిమీదకు రావడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్(త్రీఫేజ్)తో సాగుకు రైతులు వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు.
వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ అనివార్యం కావడంతో అధికారుల తీరు రైతుల పాలిటి శరాఘాతంలా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి స్థాయికి మించి ముడుపులు ఆశించిన అధికారులు ఇచ్చుకోలేని రైతులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నట్లు పలువురు ‘నమస్తే’ ఎదుట వాపోయారు. గతంలో మంజూరు లేకుండానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, మంజూరైన వారికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోవడం వంటి అక్రమాలపై ఫిర్యాదులు వెళ్లడంతో ఏఈ శరత్, సిబ్బంది ఇరువురిని విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. వ్యవసాయ అవసరాల కోసం నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా, కనీసం వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వలేని పరిస్థితితో రైతులు అరిగోస పడుతున్నారు. మండలంలో ఇప్పటికే సుమారు 300 వరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం అంచనా ప్రతిపాదనలు పంపినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నా అవస్థలు తప్పడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం 2024లో ఐదుగురు రైతులం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నాం. నేటికీ మాకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాలేదు. మాకంటే వెనుకాల ముడుపులు చెల్లించిన రైతులకు ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. అధికారులు రైతులకు కనీస సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో నరకయాతన పడుతున్నాం. ఉన్నతాధికారులు దృష్టి సారించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలి.