యాచారం : మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేంకటేశ్వరస్వామి గుట్టపై బుధవారం జాతర మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు ప్రవీణ్శర్మ ఆలయంలోని మూలవిరాట్ విగ్రహానికి అభిశేకం, అలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని దర్శించిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీస్సులను అందజేశారు.
కొత్తపల్లి ఎంపీటీసీ సుమతమ్మ లోహిత్రెడ్డి, తక్కళ్లపల్లి సర్పంచ్ సంతోష రమేశ్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ లతా నారాయణరెడ్డి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగాణంలో భక్తులు అధిక సంఖ్యలో సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు. అనంతరం భక్తులకు ఆర్టీసీ ఉద్యోగులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొద్దుటూరి రామలింగయ్య గుప్తా ఫౌండేషన్ సభ్యులు గుట్టపై తాగునీటి వసతిని కల్పించారు. కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు.