చేవెళ్ల రూరల్, అక్టోబర్ 7: పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి మండలంలోని పలు గ్రామాలు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మండలంలోని మల్లారెడ్డిగూడ, దాని అనుబంధ గ్రామం ఎర్రోనికొటాల ప్రగతిపథంలో ముందున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో ఈ గ్రామాల రూపురేఖలు ఎంతో మారాయి. అన్ని వీధుల్లోనూ సీసీ రోడ్లు, వీధి లైట్లతో జిగేల్ మంటున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆ దారుల్లో రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో సమస్యలను సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా పెండింగ్ అపరిష్కృత సమస్యలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామంలో జనాభా 656 ఉండగా.. ఓటర్లు 635 మంది ఉన్నారు.
సర్పంచ్ మల్గారి మోహన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శిగా బాల్రాజ్ విధులు నిర్వహిస్తున్నారు. రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రూ. 27 లక్షలతో సీసీ రోడ్లు, వీధి దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠధామం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, డంపింగ్యార్డు, నర్సరీ, రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం, రూ.8.5 లక్షలతో డ్వాక్రా, రూ.6 లక్షలతో అంగన్వాడీ భవనాలను నిర్మించారు. సర్పంచ్ మోహన్రెడ్డి రూ.10 లక్షల సొంత నిధులతో రెండు గ్రామాల్లోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వైకుంఠధామాల ఏర్పాటుతో ఈ రెండు గ్రామాల్లోనూ అంతిమ యాత్రకు ఇబ్బందులు తొలగాయి. పారిశుద్ధ్య నిర్వహణకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రతిరోజూ పంచాయతీ సిబ్బంది గ్రామాల్లోని అన్ని వీధులను శుభ్రం చేస్తున్నారు. సేకరించిన చెత్తాచెదారాన్ని పల్లెప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించి.. అక్కడ ఆ చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. దానిని హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. ప్రధాన దారులకు ఇరువైపు లా.. గ్రామ పరిసరాలు, పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులకు ఆహ్లాదాన్ని పం చుతున్నాయి. మొక్కల సంరక్షణకు పంచాయతీ సిబ్బంది, వన సంరక్షకులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చలువతోనే మా గ్రామం ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటైంది. గతంలో కందవాడకు అనుబంధ గ్రామంగా ఉండేది. ప్రస్తుతం పంచాయతీగా ఏర్పాటు కావడంతో ప్రభు త్వం మంజూరు చేసిన లక్షలాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశా. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య చొరువ మరువలేనిది. ఆయన అధికంగా నిధులను మంజూరు చేశారు. గ్రామస్తుల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మల్గారి మోహన్రెడ్డి, మల్లారెడ్డి గూడ సర్పంచ్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏండ్ల నాటి సమస్యలకు మా గ్రామంలో శాశ్వత పరిష్కారం లభించింది. పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నది. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
– పడమటి రాధిక, ఉప సర్పంచ్, మల్లారెడ్డి గూడ
హరితహారం కార్యక్రమంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాం. నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు ఆహ్లాదాన్ని పం చుతున్నాయి. మొక్కల పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. స్థానికులు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేలా ఇప్పటికే అవగాహన కల్పిం చాం. దీంతో గ్రామాలు అందంగా ఉంటున్నాయి.
– బాల్రాజ్, పంచాయతీ కార్యదర్శి, మల్లారెడ్డిగూడ గ్రామం