సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో అనేక జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ధాన్యానికి కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) చేయడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా మాత్రం 2022 -23 యాసంగి సీజన్కు సంబంధించి లక్ష్యాన్ని పూర్తి చేసింది. వానకాలం సీజన్కు సంబంధించి 46 శాతం బియ్యం సేకరణ పూర్తైంది. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. మిల్లర్లపై ఒత్తిడి చేయడం వంటి చర్యల ఫలితంగా సీఎంఆర్ లక్ష్యం పూర్తికి అడుగులు వేగంగా పడుతున్నాయి.
రంగారెడ్డి, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : బియ్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పచ్చజెండా ఊపడంతో మిల్లింగ్పై దృష్టి పెట్టారు. త్వరితగతిన సేకరణ జరిగేలా పౌరసరఫరాల అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి 20,409.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగించింది. ఇందుకు బదులుగా మిల్లర్లు 13,825.20 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉండగా..13,188.352 మెట్రిక్ టన్నులు వచ్చిం ది. కడ్తాల్కు సంబంధించిన ఓ రైస్మిల్లు నుంచి సీఎంఆర్ రాకపోవడంతో అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ కొద్ది సీఎంఆర్ మినహా యాసంగికి సంబంధించి లక్ష్యం దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. 2002-03 వానకాల సీజన్కు సం బంధించి 41,304.720 మెట్రిక్ టన్నుల ధాన్యానికి మిల్లర్ల నుంచి 28,156.005 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉంది.
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్కు గడువు ఉండగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులను తనిఖీ చేస్తూ రోజువారీగా వివరాలు సేకరిస్తున్నా రు. ఈ క్రమంలో ఇప్పటివరకు 12,836.264 మెట్రిక్ టన్నుల(46 శాతం) సీఎంఆర్ లక్ష్యం పూర్తయ్యింది. మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం మేరకు ఈ నెలాఖరు లోపుగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఎఫ్సీఐకి తరలిస్తున్న సీఎంఆర్ బియ్యంలో ఖాప్రా పురుగు కనిపించడం మిల్లర్లను ఆందోళనకు గురిచేస్తున్నది. మరపట్టిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు కౌకుంట్ల, చర్లపల్లి తదితర ఎఫ్సీఐ గోదాములకు తరలిస్తున్నారు. రైస్ మిల్లుల్లో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలకు ఖాప్రా పురుగు సోకగా.. రోజురోజుకూ ఈ చీడ బెడద ఎక్కువవుతున్నది. చాలాకాలంగా మిల్లుల్లో బియ్యాన్ని నిల్వ చేసి ఉంచడం వల్ల పురుగు ఆశించి బియ్యాన్ని పిండిగా చేస్తున్నది.
ఖాప్రా పురుగు ఆశించిన బి య్యాన్ని ఎఫ్సీఐ అధికారులు తిరస్కరిస్తుండడంతో లారీలను వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో మిల్లర్లు బియ్యం లోడింగ్ నుంచి ట్రాన్స్పోర్టు వరకు ఒక్కో లారీకి రూ.లక్ష వరకు నష్టపోతున్నారు. ఈ సీజన్లోనే ఇప్పటివరకు 20 లారీలకు పైగా బియ్యాన్ని ఎఫ్సీఐ తిరస్కరించడంతో మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. బి య్యం బస్తాలను ఎండకు ఆరబెట్టడం వంటి జాగ్రత్తలను తీసుకుంటున్నా ఫలితం లేదని మిల్లర్లు వాపోతున్నారు. కొత్త బస్తాలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పౌర సరఫరా శాఖ నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ఖాప్రా చీడ పురుగు ప్రభావం సీఎంఆర్ లక్ష్యంపైనా ప్రభావం చూపుతున్నది.