ఉమ్మడి జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతున్నది. శుక్రవారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వరద నీరు వచ్చి చేరుతుండగా.. అలుగులు దుంకుతున్నాయి. అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి అక్కడక్కడ శిథిలావస్థకు చేరిన ఇండ్లు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టారు.
-రంగారెడ్డి, జూలై 21, (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాగు, వంకలు ఉప్పొంగగా, కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు పుష్కలంగా చేరి మత్తడి దుంకుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునగగా, కాల్వలపై ఉన్న కల్వర్టుల వద్ద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేలకూలగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
వికారాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో జోరు వాన కురిసింది. ప్రధానమైన మూసీ, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలు చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన పలు ఇండ్లు నేలకూలగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా ప్రజలకు అత్యవసరమైన సాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి, 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నవాబుపేట మండలం చించల్పేట్ వద్ద మూసీ ఉధృతిని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించగా, మరోవైపు పరిగి మున్సిపాలిటీ వద్ద వాగు ఉధృతిని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిశీలించి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా 8 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, కుల్కచర్ల మండలంలో అత్యధికంగా 16 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. పూడూరు మండలంలో 11.1 సెం.మీటర్లు, చౌడాపూర్ మండలంలో 10.7 సెం.మీటర్లు, దుద్యాల మండలంలో 10.5 సెం.మీటర్లు, వికారాబాద్ మండలంలో 9.9 సెం.మీటర్లు, తాండూరు మండలంలో 9.7 సెం.మీటర్లు, పరిగి మండలంలో 8.6 సెం.మీటర్లు, బొంరాసుపేట మండలంలో 8.3 సెం.మీటర్లు, కొడంగల్ మండలంలో 8.2 సెం.మీటర్లు, బషీరాబాద్ మండలంలో 7.9 సెం.మీటర్లు, పెద్దేముల్ మండలంలో 7.8 సెం.మీటర్లు, యాలాల్ మండలంలో 7.7 సెం.మీటర్లు, బంట్వారం మండలంలో 7.1 సెం.మీటర్లు, కోట్పల్లి మండలంలో 6.8 సెం.మీటర్లు, ధారూరు మండలంలో 6.7 సెం.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 6.6 సెం.మీటర్లు, మోమిన్పేట మండలంలో 6 సెం.మీటర్లు, నవాబుపేట మండలంలో 5.9 సెం.మీటర్లు, దోమ మండలంలో 5.5 సెం.మీ, మర్పల్లి మండలంలో 3.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
రంగారెడ్డి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ముసురేసిన మొగులు తెరిపివ్వకుండా కురుస్తున్నది. ఊరూరా జలకళ ఉట్టిపడుతున్నది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో సరాసరి 6.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. షాబాద్, కొందుర్గ్లలో అత్యధికంగా 1.63 సెం.మీ వర్షం కురిసింది. నందిగామలో 1.58 సెం.మీ, ఫరూఖ్నగర్లో 1.41 సెం.మీ, శంకర్పల్లిలో 1.32 సెం.మీ, కొత్తూరులో 1.30 సెం.మీ, చౌదర్గూడెంలో 1.25 సెం.మీ, శంషాబాద్లో 1.23 సెం.మీ, చేవెళ్లలో 1.04 సెం.మీ, మహేశ్వరంలో 1.02 సెం.మీ వర్షపాతం నమోదైంది.