పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నూతన ఓటర్ల నమోదులో కొత్తగా ఓటరుగా నమోదైన వారికి ఏపిక్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్డుతో పాటు ఓటర్కిట్ సైతం ఈనెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం లోపు అందజేయాలని చెప్పారు. ఓటర్ కిట్లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటరు ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు ఉంటుందన్నారు.
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవడానికి దరఖాస్తులు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎలక్షన్ సెక్షన్ తాసిల్దార్ శ్రీధర్ పాల్గొన్నారు.